హైదరాబాద్, మే 20 (నమస్తే తెలంగాణ): రాజకీయ విమర్శలకు, ప్రతిపక్షాల తప్పుడు ఆరోపణలకు చెంప పెట్టులా రాష్ట్రవ్యాప్తంగా ధాన్యం కొనుగోలు ప్రక్రియ వేగంగా కొనసాగుతున్నది. ధాన్యం కొనుగోలులో రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా పౌరసరఫరాల సంస్థ అధికారులు చర్యలు తీసుకున్నారు. నిబంధనల ప్రకారం ఉన్న ధాన్యాన్ని నిమిషాల్లోనే కాంటా పెట్టేస్తున్నారు. ఇప్పటివరకు సుమారు 5 లక్షల మంది రైతుల నుంచి 35 లక్షల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. కొనుగోలు చేసిన ధాన్యం విలువ సుమారు రూ.7 వేల కోట్లు. గత ఏడాది ఇదే సమయంలో కొనుగోలు చేసిన ధాన్యం 23 లక్షల టన్నులు. కాగా ఈ ఏడాది ఇప్పటికే 35 లక్షల టన్నుల వరకు కొనుగోలు చేయడం విశేషం. నిరుడితో పోల్చితే 12 లక్షల టన్నుల ధాన్యం అధికంగా కొనుగోలు చేశారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియ వేగంగా జరుగుతుందనడానికి ఇదే నిదర్శనం.
ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎఫ్సీఐ పలు నిబంధనలు విధించింది. ఈ నిబంధనల ప్రకారం ధాన్యం కొనుగోలు చేయకపోతే వాటి ద్వారా వచ్చే బియ్యం తీసుకోదు. దీంతో స్థానిక అధికారులు కేంద్ర నిబంధనలు పాటిస్తూ ధాన్యం కొనుగోలు చేయాల్సి వస్తున్నది. వర్షాలతో పలుచోట్ల ధాన్యం తడిసి రైతులు తీవ్ర ఇబ్బందులుపడ్డారు. అకాల వర్షాల నేపథ్యంలోనూ నిబంధనలు సడలించేందుకు కేంద్రం ఒప్పుకోలేదు. తేమ శాతాన్ని పెంచాలని కోరుతూ పౌరసరఫరాల శాఖ ఎఫ్సీఐకి లేఖ రాసినా ఫలితం దక్కలేదు. కేంద్రం సానుకూలంగా స్పందించకపోవడంతో రైతులకు అండగా నిలువాలన్న సంకల్పంతో ముఖ్యమంత్రి కేసీఆర్.. రైతుల నుంచి తడిసిన ధాన్యాన్ని సైతం కొనుగోలు చేయాలని ఆదేశించారు. ఆయా జిల్లాల్లో 1.28 లక్షల టన్నుల తడిసిన ధాన్యం కొనుగోలుకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. తద్వారా రైతులకు పెద్ద ఊరట లభించింది.
ధాన్యం విక్రయించడంలో రైతులు నష్టపోకుండా, వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా పౌరసరఫరాల సంస్థ అన్ని చర్యలు తీసుకున్నది. తరుగు, తేమ పేరుతో మిల్లర్లు రైతులను మోసం చేస్తున్నారంటూ వస్తున్న ఆరోపణలు, ఫిర్యాదులపై అధికారులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఇందుకోసం పౌరసరఫరాల సంస్థ విజిలెన్స్ టీంలను ఏర్పాటుచేసింది. ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నది. మంత్రి గంగుల కమలాకర్, సంస్థ చైర్మన్ రవీందర్సింగ్ స్వయంగా క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు. కొనుగోలు కేంద్రాలు, రైస్ మిల్లుల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నారు. అక్కడి రైతులు, మిల్లర్లతో మాట్లాడి సమస్యలను పరిష్కరిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న మిల్లర్లపై చర్యలు తీసుకుంటున్నారు.
ధాన్యం కొనుగోలు విషయంలో రైతులు ప్రతిపక్షాల రాజకీయ ఉచ్చులో చిక్కుకోవద్దు. సీఎం కేసీఆర్ ఆదేశాలతో ప్రతి రైతు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేసే బాధ్యత ప్రభుత్వానిది. రైతులు నష్టపోవద్దన్న సంకల్పంతో తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేశాం. కేంద్ర ప్రభుత్వ నిబంధనల మేరకు ధాన్యాన్ని ఆరబెట్టి తాలు, తేమ లేకుండా కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలి.
– గంగుల కమలాకర్, పౌరసరఫరాలశాఖ మంత్రి