హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 12(నమస్తే తెలంగాణ): కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ (సీఎస్ఈ)తోనే సివిల్ ఇంజినీరింగ్ కోర్సును జేఎన్టీయూ అందుబాటులోకి తేనున్నది. ఇందుకు స్వీడన్ బీటీహెచ్ యూనివర్సిటీతో ఒప్పందం చేసుకొన్నది. ఒప్పందం ప్రకారం.. జేఎన్టీయూ ఇప్పటికే కంప్యూటర్ సైన్స్, ఈసీఈ బ్రాంచిలలో ఐదేండ్ల డ్యూయల్ డిగ్రీలను అందిస్తున్నది. కొత్తగా 202425 విద్యాసంవత్సరం నుంచి సాఫ్ట్వేర్ ఇంజినీరింగ్, మెకానికల్ ఇంజినీరింగ్తో పాటు సీఎస్సీ-సివిల్, సైబర్ సెక్యూరిటీ కోర్సులను ప్రవేశపెట్టనున్నది.
దీంతో సివిల్ ఇంజినీర్ల కొరత భవిష్యత్తులో కొంత వరకు తగ్గుతాయని జేఎన్టీయూ వీసీ కట్టా నరసింహారెడ్డి అభిప్రాయపడ్డారు. ఈ కోర్సులో ప్రవేశాలు పొందిన వారికి మొత్తం డ్యూయల్ కోర్సు వ్యవధి ఐదేండ్లు ఉంటుందని తెలిపారు. వీటిలో మూడేండ్లు జేఎన్టీయూలో.. మరో ఒకటిన్నర సంవత్సరం స్వీడన్లో చదువాలని పేర్కొన్నారు. కోర్సు పూర్తి చేసిన విద్యార్థులకు జేఎన్టీయూ.. బీటెక్తో పాటు ఎంటెక్ డిగ్రీ ప్రదానం చేస్తుంది. స్వీడన్లో బీటీహెచ్ వర్సిటీ ఎంఎస్ సర్టిఫికెట్ అందజేస్తుందని అధికారులు తెలిపారు. జేఎన్టీయూ వీసీ ఆధ్వర్యంలో ఏర్పాటైన ఐదుగురు కమిటీ సభ్యుల బృందం నాలుగు రోజులు స్వీడన్ పర్యటన ముగించుకొన్నది. త్వరలోనే ఈ రెండు యూనివర్సిటీలు సిలబస్ రూపొందించనున్నాయి.
ఐదేండ్ల డ్యూయల్ డిగ్రీలో ప్రవేశాలను ఎంసెట్ ర్యాంకు లేదా ఇంటర్ మార్కుల ఆధారంగా నిర్వహిస్తారు. కోర్సు ఫీజును ప్రతి ఏడాది రూ. 1 లక్షగా నిర్ణయించారు.