రవీంద్రభారతి, జనవరి 25: సినారె పురస్కారానికి రచయిత్రి కుప్పిలి పద్మను ఎంపిక చేసినట్టు సుశీల నారాయణరెడ్డి ట్రస్ట్ సభ్యుడు, ప్రముఖ సాంస్కృతిక సంస్థ రసమయి స్థాపకుడు డాక్టర్ ఎంకే రాము తెలిపారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. 2023 సంవత్సరానికి ఆమెను ఎంపిక చేసినట్టు పేర్కొన్నారు. 31న రవీంద్రభారతిలో విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి, ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కేవీ రమణాచారి పురస్కారం అందిస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కేంద్ర మంత్రి టీ సుబ్బరామిరెడ్డి, డాక్టర్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, వాడ్రేవు చినవీరభద్రుడు పాల్గొంటారని తెలిపారు. పురస్కార గ్రహీతకు రూ. 50 వేల నగదు, జ్ఞాపిక అందజేయనున్నట్టు చెప్పారు.