హైదరాబాద్, ఆగస్టు 31 (నమస్తే తెలంగాణ) : పచ్చదనాన్ని పెంపొందించేందుకు ఈ వినాయక చవితికి ప్రతి ఒక్కరూ విత్తన గణపతిని పూజించాలని మెగాస్టార్ చిరంజీవి పిలుపునిచ్చారు. హైదరాబాద్లోని తన నివాసంలో గ్రీన్ ఇండియా చాలెంజ్ రూపకర్త, మాజీ ఎంపీ సంతోష్కుమార్తో కలిసి ఆ సంస్థ రూపొందించిన సీడ్ గణేశా ప్రతిమలను సోమవారం ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ.. పూజ అనంతరం ఇంట్లోనే నిమజ్జనం చేయడం ద్వారా వినాయకుడు మొక్కగా మారి మనల్ని ఆశీర్వదిస్తాడని పేర్కొన్నారు.గ్రీన్ ఇండియా చాలెంజ్ను ఒక యజ్ఞంలా భావించి 20 కోట్లకు పైగా మొకలు నాటేలా లక్షలాది మందిని ప్రోత్సహించిన సంతోష్కుమార్ను చిరంజీవి అభినందించారు. విత్తన గణపతులను తేవడం అభినందనీయమని ప్రశంసించారు.
సీడ్ గణేశా ప్రతిమలను మట్టి, కోకోపిట్, కొబ్బరి పొడితో తయారు చేస్తారు. వీటి లోపల వేప, చింత వంటి విత్తనాలను నిక్షిప్తం చేస్తారు. నవరాత్రి పూజల తర్వాత భక్తులు ఈ విగ్రహాన్ని తమ ఇంటి పెరట్లో లేదా ఒక కుండీలో ఉంచి నీళ్లు పోస్తే చాలు.. విగ్రహం కరిగిపోయి, అందులోని విత్తనాలు మొలకెత్తి ఎదుగుతాయి.
మాజీ సీఎం కేసీఆర్ ఆలోచనలతో పురుడుపోసుకున్న హరితహారం స్ఫూర్తితో 2018లో ప్రారంభమైన గ్రీన్ ఇండియా చాలెంజ్, 2020 కొవిడ్ సంక్షోభ సమయంలో ఈ ‘సీడ్ గణేషా’ ప్రయాణానికి శ్రీకారం చుట్టిందని మాజీ ఎంపీ సంతోష్కుమార్ తెలిపారు. అప్పటి అటవీ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి చేతుల మీదుగా మొదలై ఏటా లక్షలాది విగ్రహాలు ఉచితంగా పంపిణీ చేశామని చెప్పారు. 2023లో చైల్డ్ ఆర్టిస్ట్ ధృవన్, 2025లో స్వర్ణగిరి క్షేత్రంలో నటుడు నారా రోహిత్ సమక్షంలో 5 లక్షల విగ్రహాల లక్ష్యంతో సాగిన ఈ ఉద్యమం, 2026 సీజన్కు గాను చిరంజీవి ఆవిషరణతో మరింత ప్రజాదరణ పొందనున్నదని పేర్కొన్నారు. ఈ పర్యావరణ ఉద్యమంలో పౌరులు, హౌసింగ్ సొసైటీలు భాగస్వాములు కావాలని గ్రీన్ ఇండియా చాలెంజ్ తరఫున సంతోష్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.