కాశీబుగ్గ, జనవరి 6: వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో శుక్రవారం దేశీ రకం కొత్త మిర్చికి రికార్డు స్థాయి ధర పలికింది. ఈ సీజన్లో అత్యధికంగా క్వింటాల్ ధర రూ.80,100 వచ్చింది. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం రావిచెట్టు తండాకు చెందిన తేజావత్ రాములు 4 బస్తాల మిర్చిని మార్కెట్కు తీసుకువచ్చారు. మిర్చి గత సీజన్లో అత్యధికంగా క్వింటాల్కు రూ.96 వేలు పలికింది.
ఈ సీజన్ డిసెంబర్ నుంచి ప్రారంభం కాగా, శుక్రవారం అత్యధిక ధరలు పలికాయి. అన్నపూర్ణ ట్రేడర్స్ అడ్తి ద్వారా శ్రీ చైత్ర ఎంటర్ప్రైజెస్ ఖరీదు వ్యాపారి క్వింటాల్కు రూ.80,100 చెల్లించి కొనుగోలు చేశారు. సీజన్ ప్రారంభంలోనే దేశీరకం మిర్చికి అత్యధిక ధర పలుకడంతో రైతులు సంతోషం వ్యక్తం చేశారు. నాణ్యత గల మిర్చిని మార్కెట్కు తీసుకువస్తే గిట్టుబాటు ధరలు పొందవచ్చని కార్యదర్శి బరుపాటి వెంకటేశ్ రాహుల్ తెలిపారు.