మహబూబ్నగర్, మార్చి 10 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : మూడేండ్ల పసిపాప 22 రోజులుగా బాధపడుతూ.. కుటుంబ సభ్యులను కన్నీళ్లు పెట్టిస్తున్న హృదయ విదారక ఘటన సీఎం సొంత జిల్లా.. మహబూబ్నగర్లో మంగళవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అంగన్వాడీకి వెళ్లిన పసిపాప కోడిగుడ్ల కోసం ఉడికించిన నీళ్లలో పడడంతో ఒళ్లు కాలిపోయినా అధికార యంత్రాంగం పట్టించుకోకపోవడం విమర్శలకు తావిస్తున్నది. ప్రైవేటలో వైద్యం చేయించడానికి డబ్బుల్లేక.. పసిపాప బాధ చూడలేక కుటుంబసభ్యులు పుట్టెడు దుఃఖంతో ప్రజావాణికి వచ్చి ఫిర్యాదు చేసినా అధికారుల్లో చలనంలేకపోవడంపై పలువురు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. కాలిన గాయాలతో బాధ పడుతూ.. కన్నీళ్లే ఆహారంగా తీసుకుంటూ.. చిక్కి శల్యమవుతున్న చిన్నారి కథ పలువురిని కంటతడి పెట్టిస్తున్నది. వివరాల్లోకి వెళితే.. బాలానగర్ మండలం హేమాజీపూర్ శివారు బిల్డింగ్తండాకు చెందిన మూడేండ్ల సాయిశ్రీ ఫిబ్రవరి 17న ఆడుకుంటూ వెళ్లి సమీపంలోని అంగన్వాడీ కేంద్రంలో గుడ్లు ఉడకబెట్టిన వేడి నీటిలో ప్రమాదవశాత్తు పడిపోయింది.
చిన్నారి శరీరం కాలిపోయి హాహాకారాలు చేస్తూ ఉండగా.. తాపీగా వచ్చిన అంగన్వాడీ సిబ్బంది తల్లిదండ్రులను పిలిచి పాపను ఇంటికి పంపించేశారు. పాప వెనుక భాగం తీవ్రంగా కాలిందన్న కనికరం లేకుండా.. ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వకుండా సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించారు. చిన్నారి తల్లిదండ్రులు పేదలు కావడంతో వైద్యం చేయించేందుకు ఇబ్బందులు పడుతున్నారు. ప్రైవేట్ దవాఖానలో వేల రూపాయలు ఖర్చు అవుతాయని వైద్యులు చెప్పడంతో చేసేది లేక గాయాలకు ఆయింట్మెంట్ రాసి ఇంటికి తీసుకొచ్చారు. బాధ తట్టుకోలేక 23 రోజులుగా పాప ఏడుస్తూ ఉన్నదని తండ్రి సుమన్ నాయక్ ఆవేదన వ్యక్తంచేశారు. ఈ క్రమంలో మహబూబ్నగర్ కలెక్టరేట్లో సోమవారం జరిగిన ప్రజావాణిలో వినతిపత్రం ఇవ్వడానికి వెళితే ఎవరూ పట్టించుకోవడంలేదని వాపోయారు. నాయనమ్మతో కలిసి కలెక్టరేట్కు వచ్చిన చిన్నారి అక్కడి మెయిన్ గేటు వద్ద రోదిస్తున్న దృశ్యం పలువురిని కలిచివేసింది. ఈ ఘటనకు కారకులైన అంగన్వాడీ సిబ్బంది, పట్టించుకోని కలెక్టరేట్ సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి పాపకు మెరుగైన వైద్యం అందించాలని కోరుతున్నారు.