హైదరాబాద్, ఆగస్టు 14 (నమస్తే తెలంగాణ): అధికారులు సమన్వయంతో పనిచేసి స్వాతంత్య్ర వేడుకలకు ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఆదేశించారు. సోమవారం గోల్కొండ కోటలో ఏర్పాట్లను ఆమె పరిశీలించారు. వేదికతోపాటు వేడుకలు నిర్వహించే ప్రాంతాల్లో కలియ తిరిగిన సీఎస్, అధికారులకు పలు సూచనలు చేశారు.
బ్లూబుక్ ప్రకారం పోలీసుశాఖ తగిన బందోబస్తు ఏర్పాటు చేయాలని, ట్రాఫిక్ మళ్లింపు సమాచారాన్ని ముందుగానే ప్రజలకు తెలియజేయాలని కోరారు. ట్రాఫిక్ నిర్వహణ, విద్యుత్తు, సీటింగ్, నీటి సరఫరా, పారిశుధ్యం, వైద్యసేవలు, సాంస్కృతిక కార్యక్రమాల ఏర్పాట్లను పరిశీలించారు. అదనపు డీజీ స్వాతి లక్రా, ట్రాఫిక్ అదనపు సీపీ సుధీర్బాబు, ఆర్అండ్బీ సెక్రటరీ శ్రీనివాసరాజు, జీహెచ్ఎంసీ కమిషన్ రొనాల్డ్రోస్, జలమండలి ఎండీ దానకిషోర్, ఐఅండ్పీఆర్ కమిషనర్ అశోక్రెడ్డి పాల్గొన్నారు.