Private School Fee | హైదరాబాద్, ఏప్రిల్ 3 (నమస్తే తెలంగాణ): ప్రైవేట్ స్కూళ్లలో ఫీజులు అత్యంత తక్కువగా ఉన్నట్టు సాక్షాత్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి స్టేట్మెంట్ ఇచ్చేశారు. తల్లిదండ్రుల రక్తమాంసాలు పిండుతూ ఒక్కో విద్యార్థి నుంచి ఏటా లక్షలాది రూపాయలను ప్రైవేట్ విద్యాసంస్థలు కొల్లగొడుతున్న వైనాన్ని ఆయన మరచారు. ‘అ, ఆ, ఇ, ఈ’లు నేర్పేందుకు కూడా నెలకు రూ.10 వేల చొప్పన ఏటా రూ.లక్షకు పైగానే పిండుతున్న దారుణాలను కప్పిపుచ్చారు. ప్రైవేటు విద్యార్థుల ఫీజుల దోపిడీకి అడ్డుకట్ట వేయాలని తల్లిదండ్రులతోపాటు, న్యాయస్థానాలు మొత్తుకుంటున్నా వినిపించుకోని ముఖ్యమంత్రి.. ప్రైవేట్ విద్యాసంస్థల్లో నెలకు రూ.3 వేల నుంచి రూ.4 వేల లోపులోనే ఫీజులు ఉన్నాయని గొప్పగా అభివర్ణించారు.
పైగా, తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న ఒక్కో విద్యార్థిపై ప్రభుత్వం అక్షరాల రూ.1,08,000 ఖర్చు చేస్తున్నా.. సరిగ్గా చదువలేకపోతున్నారంటూ అసహనం వ్యక్తంచేశారు. సాక్షాత్తూ ముఖ్యమంత్రి వ్యాఖ్యలు అలా ఉంటే.. కాంగ్రెస్ ఎమ్మెల్యే మల్రెడ్డి రం గారెడ్డి మాట్లాడుతూ ఒకడుగు ముందుకేసి ఇలాంటి ప్రైవేట్ విద్యాసంస్థలు ఉంటేనే.. మన పిల్లల భవిష్యత్తు బాగుంటుందని కితాబునిచ్చారు. వీరిద్దరూ మాట్లాడిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
కాంగ్రెస్ ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి వియ్యంకుడైన బీజేపీ ఎమ్మెల్సీ ఏవీఎన్ రెడ్డికి చెందిన ఇబ్రహీంపట్నం పరిధిలోని ‘లేక్ ఫీల్డ్ గ్లోబల్ స్కూల్’ ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా హాజరైన సీఎం రేవంత్రెడ్డి ప్రైవేట్ స్కూళ్లు, కాలేజీల దోపిడీని వెనుకేసుకొచ్చారు. ‘ఇక్కడున్న ప్రైవేట్ విద్యాసంస్థలు ఒక్కో విద్యార్థిపై ఏడాదికి ఎంత తీసుకుంటున్నారో నాకు తెలియదు కానీ.. నాకు తెలిసి నెలకు రూ.3 వేల నుంచి రూ.4 వేలే తీసుకున్నా కూడా ఏడాదికి రూ.50 వేల లోపే ఖర్చవుతుంది’ అంటూ ప్రైవేట్స్కూళ్ల దోపిడీపై సీఎం రేవంత్రెడ్డి తన అజ్ఞానాన్ని ప్రదర్శించుకున్నారు. ‘నా ప్రభుత్వంలో ఒక విద్యార్థికి అయ్యే ఖర్చును ఇక్కడున్న ప్రజాప్రతినిధులతోపాటు, టీచర్లు కూడా తెలుసుకోవాలని అనుకుంటున్నా.
ప్రతి ఒక్క విద్యార్థిపై రాష్ట్ర ప్రభుత్వం రూ.1,08,000 ఖర్చు చేస్తున్నది. ఇంత ఖర్చు చేస్తున్నా కూడా ఆరో తరగతి చదివే పిల్లాడు మూడో తరగతి పుస్తకం చదువలేకపోతున్నాడు. ఈ ఖర్చు అనేది చాలా పెద్దది. ఆ లెక్కలన్నీ మనమెవ్వరం లెక్కించడం లేదు’ అంటూ తాను నిర్వహిస్తున్న విద్యావ్యవస్థ తీరుపై సీఎం రేవంత్రెడ్డి అసహనం వ్యక్తంచేశారు. ఇక తాను భవిష్యత్తులో నిర్మించాలనుకుంటున్న, తన బ్రెయిన్ చైల్డ్ అయిన యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు ఎలా ఉండాలని తాను అనుకున్నారో.. ఏవీఎన్ రెడ్డికి చెందిన లేక్ ఫీల్డ్ గ్లోబల్ స్కూల్ కూడా అలాగే ఉన్నదని కితాబివ్వడం కూడా పలు విమర్శలకు దారితీస్తున్నది. ‘ఇట్లాంటి ప్రైవేట్ విద్యాసంస్థలు ఉంటేనే మన పిల్లల భవిష్యత్తు బాగుంటది’ అంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి పేర్కొనడం మరింత వివాదాస్పదమైంది. కాగా, సీఎం ప్రైవేట్ స్కూల్ ప్రారంభోత్సవానికి హా జరవ్వడంపై ఏఐఎస్ఎఫ్ మండిపడింది. ప్రభుత్వ బడులను బలోపేతం చేయాల్సింది పోయి, ప్రైవేట్ విద్యను ప్రోత్సహించేలా సీఎం తీరు ఉన్నదని విమర్శించింది. దీనిని ఏఐ ఎస్ఎఫ్ సహించదని ఆగ్రహం వ్యక్తంచేసింది.