హైదరాబాద్, జనవరి 25 (నమస్తే తెలంగాణ): రాష్ట్రాల సమాఖ్యగా వర్థిల్లుతున్న భారత దేశంలో ఫెడరల్ స్ఫూర్తి పరిఢవిల్లుతూ, న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం మూలస్తంభాలుగా పాలన సాగినప్పుడు మాత్రమే దేశంలో సంక్షేమం విలసిల్లి, మరింత ప్రగతి పథంలో పయనిస్తుందని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అన్నారు. విభిన్న పూలతో కూడిన పుష్పగుచ్ఛం మాదిరి విభిన్న సామాజిక, సంసృతులు, సంప్రదాయాలు, భాషలు, ఆచారాలతో భిన్నత్వంలో ఏకత్వాన్ని పొదిగిఉండటమే భారతదేశ ప్రధాన లక్షణమని పేర్కొన్నారు. భారతదేశాన్ని సర్వసత్తాక,సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా ప్రకటించుకొంటూ మనకు మనం సగర్వంగా సమర్పించుకొన్న పవిత్ర రాజ్యాంగాన్ని ప్రతీ పౌరుడు క్షుణ్ణంగా అవగాహన చేసుకొని, ఆ ఆశయాలను సాధించేందుకు మరింతగా కృషి చేయాలని దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. సమానత్వంతో కూడిన సమర్థ, ప్రజాస్వామిక పాలన ద్వారానే దేశ రా జ్యాంగం ఆశించిన లక్ష్యం పరిపూర్ణంగా సిద్ధిస్తుందని తెలిపారు. భారత 74వ గణతంత్ర దినోత్సవాన్ని (జనవరి 26) పురసరించుకొని దేశ ప్రజలకు సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. సర్వసత్తాక, గణతంత్ర, ప్రజాస్వామిక దేశంగా భారత్లో రాజ్యాంగబద్ధ పాలనకు అంకురార్పణ జరిగిన ఈ రోజు దేశ పౌరులందరికీ పండుగ దినమని పేర్కొన్నారు. రాజ్యాంగ నిర్మాతల కృషిని ప్రజలు సదా స్మరించుకొంటారని తెలిపారు.