హైదరాబాద్, జూన్ 2 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో అన్ని కులాలు, అన్ని మతాలకు తమ ప్రభుత్వం సమ ప్రాధాన్యం ఇస్తున్నదని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు తెలిపారు. వెనుకబడిన వర్గాల అభివృద్ధి, స్వయం సమృద్ధికోసం అనేక పథకాలను అమలుచేస్తున్నట్టు చెప్పారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల కానుకగా బీసీ కుల వృత్తుల కుటుంబాలకు రూ.లక్ష చొప్పున ఆర్థికసాయం అందజేస్తామని ప్రకటించారు. రాష్ట్ర అవతరణ ఉత్సవాలలో భాగంగా సచివాలయ ప్రాంగణంలో శుక్రవారం నిర్వహించిన సభలో సీఎం మాట్లాడారు. రజక, నాయీ బ్రాహ్మణ, విశ్వ బ్రాహ్మణ, కుమ్మరి, మేదరి తదితర కుటుంబాల వారికి రూ.లక్ష చొప్పున సాయం అందజేస్తామని పేర్కొన్నారు. ఇప్పటికే గొల్ల కురుమలకు గొర్రెలు పంపిణీ చేస్తున్నామని చెప్పారు. తొలి విడతలో రూ.6,100 కోట్లతో 3.93 లక్షల మంది లబ్ధిదారులకు 82.64 లక్షల గొర్రెలను పంపిణీ చేశామని, ప్రస్తుతం రెండో విడతలో భాగంగా రూ.5 వేల కోట్లతో 3.38 లక్షల మందికి దశాబ్ధి ఉత్సవాల్లో గొర్రెలను పంపిణీ చేస్తామని వెల్లడించారు. సీఎం ప్రసంగం ఆయన మాటల్లోనే..
తెలంగాణ దశాబ్ది వేడుకల వేళ ఆదివాసీ గిరిజనుల చిరకాల ఆకాంక్షను తెలంగాణ ప్రభు త్వం నెరవేరుస్తున్నది. పోడు సమస్యకు శాశ్వత పరిష్కారంగా గిరిజనులకు ప్రభుత్వ భూములపై హక్కులు కల్పిస్తున్నాం. ఈ నెల 24 నుంచి పోడు పట్టాల పంపిణీకి ప్రభుత్వం శ్రీకారం చుడుతున్నది. అటవీ భూములపై ఆధారపడిన 1.5 లక్షల మంది ఆదివాసీ, గిరిజనులకు 4 లక్షల ఎకరాల పోడు భూములపై యాజమాన్య హక్కులు కల్పిస్తాం. పోడు భూములకు కూడా రైతుబంధు పథకం వర్తింప చేస్తాం.
దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే సేకరించిన ప్రభుత్వ భూముల్లో అర్హులైన వారికి ఇండ్ల స్థలాల పంపిణీ చేపట్టాలని నిర్ణయించాం. ఆయా గ్రామాల్లో నివాసయోగ్యమైన ప్రభుత్వ భూములను గుర్తించి పేదల ఇండ్ల నిర్మాణాల కోసం కేటాయిస్తాం.
గర్భిణులకు పోషకాహారాన్ని అందించేందుకు ప్రభుత్వం ప్రారంభించిన కేసీఆర్ న్యూట్రిషన్ కిట్స్ను ఇకపై రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ పంపిణీ చేస్తాం. ఇప్పటికే ఈ పథకం 9 జిల్లాల్లో ప్రారంభమై మంచి ఫలితాలను సాధించింది. దశాబ్ది ఉత్సవాల్లో మిగతా 24 జిల్లాల్లోనూ న్యూట్రిషన్ కిట్ల పంపిణీని ప్రభుత్వం ప్రారంభిస్తున్నది. గర్భిణుల్లో రక్తహీనత సమస్యను నివారించడం కోసం, గర్భస్థ శిశువు ఆరోగ్యంగా ఎదగడం కోసం ప్రొటీన్లు, విటమిన్లతో కూడిన పోషకాహారాన్ని న్యూట్రిషన్ కిట్ల ద్వారా ప్రభుత్వం అందజేస్తున్నది.
సొంతస్థలం ఉండి కూడా ఆర్థిక స్థోమత సరిపోక ఇల్లు నిర్మించుకోలేని పేదలకు ప్రభుత్వం తరుఫున ఆర్థిక సాయం చేసేందుకు ‘గృహలక్ష్మి’ పథకాన్ని రూపొందించాం. మహిళల పేరి ట అమలు చేసే ఈ పథకాన్ని జూలైలో ప్రారంభిస్తాం. గృహలక్ష్మి పథకం కింద ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ.3 లక్షలు మూడు దశల్లో అంది స్తాం. ఈ పథకం అమలు కోసం ప్రభుత్వం రూ.12 వేల కోట్లు ఖర్చు చేయబోతున్నది.
ఇంటింటికీ నల్లా నీళ్లు ఇచ్చి మహిళల గోస తీర్చకపోతే ప్రజలను ఓట్లు అడగబోను అని రాష్ట్రం వచ్చిన తొలినాళ్లలో నేను ప్రతిజ్ఞ చేసిన. మిషన్ భగీరథ ద్వారా నూటికి నూరు శాతం గృహాలకు నల్లాల ద్వారా శుద్ధిచేసిన మంచినీటిని సరఫరా చేస్తున్నం. ప్రతి ఇంటికి స్వచ్ఛమైన తాగునీరు అందించడంలో తెలంగాణ రాష్ట్రం దేశంలో ప్రథమ స్థానంలో ఉన్నది. పశ్చిమబెంగాల్ అట్టడుగు స్థానంలో ఉండగా, ప్రధాని మోదీ సొంత రాష్ట్రం గుజరాత్ మూడోస్థానంలో ఉన్నది. మన మిషన్ భగీరథను అనుకరిస్తూ కేంద్ర ప్రభుత్వం హర్ ఘర్ జల్ యోజన అనే పథకాన్ని అమలుచేస్తున్నది. మిషన్ భగీరథతో ఇప్పుడు తాగునీటి కోసం మండుటెండలో బిందెలు నెత్తిన పెట్టుకొని మైళ్లకు మైళ్లు నడిచే దృశ్యాలు లేవు. ఖాళీ బిందెలతో ప్రజల ధర్నాలు లేవు. ఫ్లోరోసిస్ బారినపడి వికలాంగులుగా మారిన దృశ్యాలు మచ్చుకు కూడా కనిపించటంలేదు.
రాష్ట్ర వ్యవసాయరంగానికి ప్రధాన ఆధారమైన చెరువులకు జీవం పోసేందుకు కాకతీయుల స్మరణలో మిషన్ కాకతీయ పథకానికి శ్రీకారం చుట్టినం. ఈ పథకం ద్వారా రాష్ట్రంలో 47 వేలకుపైగా చెరువులను పునరుద్ధరించి, చెరువు కట్టలను పటిష్ఠపరిచి, కాలువలకు, తూములకు మరమ్మతులు చేసి, పూడిక తొలగించిన ఫలితంగా నేడు రాష్ట్రంలోని చెరువుల్లో నీటి నిల్వ సామర్థ్యం గణనీయంగా పెరిగింది. రూ. 5,350 కోట్లు వెచ్చించి చెరువులను పునరుద్ధరించడంతోపాటు, విరివిగా చెక్ డ్యాముల నిర్మాణం చేపట్టి వాగులను పునరుజ్జీవింప చేయటంతో లక్షలాది ఎకరాల ఆయకట్టు స్థిరీకరించబడింది. నేడు దేశంలో చాలాచోట్ల భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి.. కానీ తెలంగాణలో మాత్రం పైకి ఉబికి వస్తున్నాయి.
అరవై ఏండ్ల పరిపాలనలో ఏ ఒక్క ప్రభుత్వమూ విద్యుత్తు సమస్యను పరిష్కరించలేకపోయింది. పవర్ హాలిడేలతో పరిశ్రమలు కునారిల్లిపోయేవి. పారిశ్రామికవేత్తలు ఇందిరాపార్కు దగ్గర ధర్నాకు దిగాల్సిన దయనీయ పరిస్థితి ఉండేది. తెలంగాణ వస్తే రాష్ట్రం అంధకారమవుతుందని, తీగెల మీద బట్టలు ఆరేసుకోవాల్సి వస్తుందని సమైక్య పాలకులు ఎద్దేవా చేశారు. వారి అంచనాలను తలక్రిందులు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం విద్యుత్తు రంగంలో విప్లవాత్మక విజయాలు సాధించింది.
నేడు అన్ని రంగాలకు నిరంతరాయంగా 24 గంటల పాటు, వ్యవసాయానికి ఉచితంగా విద్యుత్తు సరఫరా చేసే ఏకైక రాష్ట్రంగా తెలంగాణ కీర్తి దేశం నలుదిశలా వ్యాపించింది. ఇందుకోసం ప్రభుత్వం ఏటా రూ.12 వేల కోట్లు ఖర్చు చేస్తూ రైతు సంక్షేమం పట్ల తన చిత్తశుద్ధిని చాటుకొంటున్నది. దేశ ప్రధాని సొంత రాష్ట్రం గుజరాత్లో ఒక్కో జిల్లాలో ఒక్కో రోజు చొప్పున పవర్ హాలిడే ప్రకటిస్తుంటే… దశాబ్దిలో అడుగుపెడుతున్న పసికూన తెలంగాణ రాష్ట్రంలో క్రాప్ హాలిడేలు, పవర్ హాలిడేలు అనే మాటే లేదు.
అందుకే ఇవాళ తెలంగాణ మాడల్ దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. తెలంగాణ స్వరాష్ట్రంగా ఏర్పడే నాటికి స్థాపిత విద్యుదుత్పత్తి సామర్థ్యం 7,778 మెగావాట్లు మాత్రమే. ప్రస్తుతం దీనిని 18,453 మెగావాట్లకు పెంచినం. రాష్ట్రం ఏర్పడిన నాడు సోలార్ పవర్ ఉత్పత్తి 74 మెగావాట్లు మాత్రమే ఉండగా, ప్రస్తుతం 5,741 మెగావాట్లకు పెంచినం. తెలంగాణ విద్యుత్తు రంగాన్ని తీర్చిదిద్దడం కోసం ప్రభుత్వం త్రిముఖ వ్యూహం అనుసరించింది. నేడు తలసరి విద్యుత్తు వినియోగంలో సైతం తెలంగాణ ఎంతో ముందున్నది. 2014-15లో తెలంగాణలో తలసరి విద్యుత్తు వినియోగం 1,356 యూనిట్లు కాగా, 2021-22 నాటికి 2,126 యూనిట్లకు పెరిగింది. ఇదే సమయంలో జాతీయ సగటు 1,255 యూనిట్లు మాత్రమే. జాతీయ తలసరి వినియోగంకన్నా తెలంగాణలో తలసరి విద్యుత్తు వినియోగం 69 శాతం ఎక్కువ అని సీఎం కేసీఆర్ వివరించారు.
అంబేద్కర్ బోధనలే శిరోధార్యంగా భావించిన తెలంగాణ ప్రభుత్వం.. దళితులు స్వశక్తితో జీవించాలన్న ఆశయంతో దళితబంధు పథకాన్ని అమలు చేస్తున్నది. చరిత్రలో మునుపెన్నడూ లేనివిధంగా రాష్ట్రంలోని ప్రతి దళిత కుటుంబానికి రూ. 10 లక్షల మొత్తాన్ని వందశాతం గ్రాంటుగా అందిస్తున్నది. దళితబంధు పథకం కింద ప్రభుత్వం ఇప్పటివరకు 50 వేల మంది లబ్ధిదారులకు రూ.5 వేల కోట్ల సాయాన్ని అందించింది. ఈ ఏడాది బడ్జెట్లో దళితబంధు పథకం కోసం రూ. 17,700 కోట్లు కేటాయించాం. రెండో విడతలో 1.30 లక్షల మందికి దళిత బంధు పథకాన్ని అమలు చేయనున్నాం. ఇప్పటికే హుజూరాబాద్ నియోజకవర్గంలో నూటికి నూరు శాతం అమలుచేశాం. మిగిలిన 118 నియోజకవర్గాల్లో ఒక్కో నియోజకవర్గంలో ప్రస్తుతం 1,100 మందికి అందిస్తున్నాం.