హైదరాబాద్: నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్లో జరిగిన జాతీయ సమైక్యతా దినోత్సవ వేడుకల్లో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించి అక్కడ ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు. ఈ సందర్భంగా యావత్ తెలంగాణ ప్రజలకు ఆయన హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ చరిత్రలో సెప్టెంబర్ 17వ తేదీకి ఒక ప్రత్యేకత ఉందన్నారు. భారత దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించిన తర్వాత బ్రిటిష్ పరిపాలనకు బాహ్యంగా రాజుల ఏలుబడిలో ఉన్న సంస్థానాలను భారత యూనియన్ లో కలిపే ప్రక్రియను నాటి భారత ప్రభుత్వం చేపట్టిందని చెప్పారు. అందులో భాగంగా మన హైదరాబాద్ సంస్థానం కూడా 1948 సెప్టెంబర్ 17న సువిశాల భారతదేశంలో అంతర్భాగమయిందని తెలిపారు.
ఇంకా సీఎం ఏం మాట్లాడారో ఆయన మాటల్లోనే.. ‘హైదరాబాద్ సంస్థానం భారత దేశంలో విలీనం కావడంతో తెలంగాణలో రాచరికం ముగిసిపోయి పార్లమెంటరీ ప్రజాస్వామ్య పరిపాలన ప్రారంభమైంది. హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్ లో అంతర్భాగంగా మారిన ఈ సందర్భాన్ని జాతీయ సమైక్యతా దినోత్సవంగా జరుపుకోవడం సముచితమని తెలంగాణ ప్రభుత్వం భావించింది. అందుకే ఈ రోజున రాష్ట్రవ్యాప్తంగా జాతీయ జెండాను ఎగురవేసి వేడుకలు నిర్వహించుకుంటున్నాం. తెలంగాణ నేలపై పలు సందర్భాలలో అనేక పోరాటాలు జరిగాయి. న్యాయం కోసం, ధర్మం కోసం, రాజ్యాంగ హక్కుల సాధన కోసం ప్రాణాలను కూడా తృణప్రాయంగా భావించి, గుండెలు ఎదురొడ్డి నిలిచింది తెలంగాణ సమాజం. తెలంగాణ ప్రజాస్వామ్య పాలనలోకి పరివర్తన చెందాలని ఆనాడు యావత్ తెలంగాణ సమాజం ఆశించింది. ఆనాటి ప్రజాపోరాట ఘట్టాలు, సామాన్యులు అసామాన్యులై చేసిన త్యాగాలు, జాతి తలపుల్లో నిత్యం ప్రకాశిస్తూనే ఉంటాయి. దొడ్డి కొమురయ్య నుంచి చాకలి ఐలమ్మ దాకా, కుమ్రం భీమ్ నుంచి రావి నారాయణరెడ్డి దాకా, షోయబ్ ఉల్లాఖాన్ నుంచి సురవరం ప్రతాపరెడ్డి దాకా, స్వామి రామానందతీర్థ నుంచి జమలాపురం కేశవరావు దాకా, బండి యాదగిరి నుంచి సుద్దాల హనుమంతు, కాళోజీ, దాశరథుల దాకా ఎందరెందరో వీరయోధులూ, త్యాగధనులు, చిరస్మరణీయులైన వారందరికీ నేటి జాతీయ సమైక్యతా దినోత్సవం సందర్భంగా వినమ్రంగా నివాళులు అర్పిస్తున్నాను’ అన్నారు.
‘అసేతు హిమాచల పర్యంతం అన్ని ప్రాంతాల వర్గాల ప్రజల్లో విశ్వాసం నెలకొల్పడానికి ఆనాటి భారత పాలకులు చేసిన కీలకమైన కృషి వల్లనే నేడు మనం చూస్తున్న భారతదేశం ఆవిష్కృతమైంది. మహాత్మాగాంధీ నెలకొల్పిన సామరస్య విలువలు, భారత తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ దార్శనికత, మొదటి హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ చాకచక్యం, మరెందరో నేతల అవిరళ కృషి వల్ల దేశం ఏకీకృతమైంది. నాటి జాతీయోద్యమ నాయకుల స్ఫూర్తిదాయక కృషిని సైతం ఈ సందర్భంగా ఘనంగా స్మరించుకుందాం. తెలంగాణ భారతదేశంలో అంతర్భాగంగా మారిన తర్వాత 1948 నుంచి 1956 వరకు హైదరాబాద్ రాష్ట్రంగా వెలుగొందింది. 1956లో జరిగిన రాష్ట్రాల పునర్విభజనలో భాగంగా తెలంగాణ ప్రాంత ప్రజల మనోభీష్టానికి విరుద్ధంగా తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాలను కలిపి ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు చేయడం, దాని దుష్పరిణామాలు మనందరికీ తెలిసినవే. అందుకే, ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతానికి, ప్రజానీకానికీ జరిగిన తీరని అన్యాయాలను, అక్రమాలను, సమైక్య పాలకుల ఆధిపత్యాన్ని ఎదిరించి, తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం ఉద్యమ బావుటా ఎగురవేశాం. ఆ మహోద్యమానికి నేనే స్వయంగా సారథ్యం వహించడం చరిత్ర నాకందించిన మహదవకాశం. మీ అందరి సహకారంతో ఉద్యమాన్ని విజయతీరం చేర్చగలిగాను. స్వరాష్ర్టంలో ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే గురుతర బాధ్యతను సైతం మీరు నా భుజస్కంధాలపైనే మోపారు. తెలంగాణ సాధనతోనే నా జన్మ చరితార్థమైందని భావించాను. ఆ తర్వాత ప్రజల అనుజ్ఞను శిరసావహించి పునర్నిర్మాణ కార్యాన్ని సైతం నిబద్ధతతో నిర్వహిస్తున్నా’ అని సీఎం చెప్పారు.
‘2014 జూన్ 2న తెలంగాణ రాష్ట్రం సాకారమైన నాటి నుంచి జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు యావద్దేశానికి ఆదర్శంగా నిలిచాయి. నూతన రాష్ట్రం తెలంగాణ అనుసరిస్తున్న విధానం సమగ్రమైనదని అన్ని వర్గాల ప్రయోజనాలను నెరవేరుస్తూ సాగుతున్న సమ్మిళిత, సమీకృత అభివృద్ధి నమూనా ఆదర్శవంతమైనదని యావద్దేశం ప్రశంసిస్తున్నది. భారతదేశం విభిన్న మతాలు, సంస్కృతులు, జాతులు, భాషలు, కులాలు, తెగల సమ్మేళనం. భౌగోళిక ప్రత్యేకతలకు నిలయం. జాతీయ సమైక్యత అనేది రాజకీయ, ఆర్థిక, సాంఘిక, సాంస్కృతిక, మనోవైజ్ఞానిక రంగాలకు సంబంధించిన అంశం. జాతీయ సమైక్యతకు ఎదురవుతున్న సమస్యలను విశాల దృక్పథంతో పరిశీలిస్తే, వాటిలో ముఖ్యమైనవి ఆర్థిక సమస్యలేనని స్పష్టమవుతున్నది. 76 సంవత్సరాల స్వాతంత్ర్యం తరువాత కూడా ఇప్పటికీ ఆర్థికంగా వెనుకుబాటుతనం,పేదరికం, నిరుద్యోగం, సాంఘిక వివక్షలు మన దేశాన్ని పట్టి పీడిస్తుండటం దురదృష్టకరం. ఈ రుగ్మతలను పారద్రోలటంతో పాటు, ప్రజల అవసరాలు, ఆకాంక్షలు తెలంగాణ ప్రభుత్వానికి తెలుసు. అందుకే రాష్ట్ర సత్వరాభివృద్ధితోపాటు “సంపద పెంచాలి. పెరిగిన సంపదను అవసరమైన వర్గాల ప్రజలకు పంచాలి” అన్న ధ్యేయంతో తెలంగాణ ప్రభుత్వం ముందడుగు వేస్తున్నది.
మానవీయ కోణంలో పథకాలను రూపొందించి అమలు చేస్తున్నది. సకలజనులకూ సంక్షేమ ఫలాలు అందిస్తున్నది. రాష్ట్రంలో నేడు ప్రభుత్వ పథకాల లబ్ధి పొందని కుటుంబమేదీ లేదని ఘంటాపథంగా చెప్పవచ్చు. ప్రభుత్వ పథకాల ఫలితంగానే నేడు రాష్ట్రంలో పేదరికం తగ్గి, తలసరి ఆదాయం పెరిగింది. 2015-18 నాటికి తెలంగాణలో 13.18 శాతంగా ఉన్న పేదరికం, 2019-21 నాటికి 5.88 శాతానికి దిగివచ్చింది. మరోవంక తలసరి ఆదాయంలో దేశంలోనే తెలంగాణ నంబర్ వన్ స్థానంలో నిలిచింది. నిరంతరం శ్రమించి రాష్ట్రంలోని అన్నిరంగాలనూ బలోపేతం చేయడంతోపాటు, అభివృద్ధి అంటే ఏమిటో అనతికాలంలోనే దేశానికి చాటి చెప్పగలిగాం. “తెలంగాణ ఆచరిస్తున్నది-దేశం అనుసరిస్తున్నది” అన్నమాట అక్షర సత్యం. ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు మన రాష్ట్ర పథకాలను అనుసరించడం, తెలంగాణలో సాగుతున్న సుపరిపాలనను తమతమ రాష్ర్టాల్లో సైతం సాగాలని అక్కడి ప్రజలు కోరుకోవడమే అందుకు ప్రత్యక్ష ఉదాహరణ’ అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.