Moinabad | మొయినాబాద్, ఏప్రిల్12 : ఓ రిసార్టులో రికార్డు డ్యాన్స్లు చేయడానికి పెట్టుకున్న డీజే శబ్దానికి కోళ్లు బెదురుతున్నాయి. ఆ శబ్దాన్ని తట్టుకోలేక కోళ్లు భయపడి ఒక్క చోటకు గుంపుగా చేరి ఒకదాని మీద ఒకటి పడి మృత్యువాత పడుతున్నాయి. పోలీసులకు ఫిర్యాదు చేసిన రిసార్టు యాజమానిపై చర్యలు తీసుకోవడానికి వెనుకాడుతున్నారని కోళ్ల ఫారం యాజమాని ఆరోపిస్తున్నారు. మొయినాబాద్ మున్సిపాలిటి పరిధిలోని సురంగల్ గ్రామంలో తన సొంత పొలంలో గడ్డం వెంకట్రెడ్డి కోళ్ల ఫారంను ఏర్పాటు చేశాడు. కోళ్ల ఫారం భూమిని ఆనుకుని ఉన్న బ్రీజీ పామ్ వెంచర్లో ఒక రిసార్టు ఉంది. రిసార్టులో సెలవు దినాల్లో పార్టీలు ఏర్పాటు చేస్తుంటారు. ఈవెంట్లు ఏర్పాటు చేసినప్పుడు ఇష్టానుసారంగా డీజే సౌండు ఎక్కువగా ఏర్పాటు చేస్తున్నారు. డీజే శబ్దానికి కోళ్ల ఫారంలో ఉన్న కోళ్లు బెదురుతున్నాయి. శబ్దానికి భయపడుతున్న కోళ్ల ఒకే చోటకు గుమ్ముగూడ ఒక దాని మీద ఒకడి పడి మృత్యువాత పడుతున్నాయి.
గత ఏడాది క్రితం రిసార్టులో ఇష్టానుసారంగా ఎక్కువ సౌండ్తో డీజే ఏర్పాటు చేయడం వలన 2 కిలోల బరువు కలిగిన 100 కోళ్లు మృత్యువాత పడ్డాయి.అదే విధంగా రెండు నెలల క్రితం డీజే శబ్దానికి చిన్న కోడి పిల్లలు సుమారుగా 300 వరకు చనిపోయాయి. కోళ్లు చనిపోయినప్పుడు పోలీసులకు ఫిర్యాదు చేసిన రిసార్టు యాజమాని, నిర్వాహకులపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో రిసార్టు యాజమాని, నిర్వాహకుల తీరు మారడం లేదని కోళ్ల వ్యాపారి ఆగ్రహం వ్యక్తం చేసుక్తన్నారు. రిసార్టు నిర్వాహకులు, యాజమానిపై చర్యలుతీసుకోకపోవడంతో శుక్రవారం రాత్రి 10 గంటల సమయంలో డీజే సౌండ్ ఇష్టానుసారంగా ఏర్పాటు చేశారు. దీంతో కోళ్లు బెదిరి ఒక్క చోటకు గుమిగూడాయి. డీజే శబ్దానికి కోళ్లు ఒక్క చోటకు చేరడంతో తీవ్ర ఆందోళనకు చెందిన కోళ్ల ఫారం వ్యాపారి రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. డీజే సౌండ్ను ఇష్టానుసారంగా ఏర్పాటు చేస్తున్న రిసార్టు నిర్వాహకులపై చర్యలు తీసుకోవడంతో పోలీసులు వెనుకాడుతున్నారని, ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని కోళ్ల ఫారం యాజమాని వెంకట్రెడ్డి ప్రశ్నిస్తున్నారు. స్థానిక పోలీసులు చర్యలు తీసుకోకుంటే పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని తెలిపారు.