Minister Ponguleti | హైదరాబాద్, ఏప్రిల్ 7 (నమస్తే తెలంగాణ): ఖరీదైన చేతి గడియారాల అక్రమ రవాణా కేసులో రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి కొడుకు పొంగులేటి హర్షరెడ్డికి చెన్నై కస్టమ్స్ అధికారులు నోటీసులు ఇచ్చినట్టు తెలిసింది. అధికారులు గత నెల 28న నోటీసులు ఇచ్చినట్టు, ఈనెల 4న (గురువారం) విచారణకు హాజరుకావాలని అందులో సూచించినట్టు సమాచారం. అయితే డెంగ్యూ సోకి చికిత్స తీసుకుంటున్నానని, ఈ నెల 27న హాజరవుతానని హర్ష ఈ నెల 3న సమాధానం ఇచ్చినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో కొన్ని జాతీయ మీడియా సంస్థలు హర్షను సంప్రదించగా.. వాచీల అక్రమ రవాణా కేసులో తనకు ప్రమేయం లేదని, నిరాధారమని చెప్పినట్టు సమాచారం. అనారోగ్యంతో కస్టమ్స్ విచారణకు హాజరు కాలేకపోతున్నానని, ఈ నెల 27న తప్పనిసరిగా హాజరై వాదనలు వినిపిస్తానని వెల్లడించినట్టు తెలిసింది.
చెన్నై విమానాశ్రయంలో ఫిబ్రవరి 5న కస్టమ్స్ అధికారులు రెండు లగ్జరీ వాచీలను స్వాధీనం చేసుకున్నారు. వాటిని మహమ్మద్ ఫహెర్దీన్ ముబీన్ అనే వ్యక్తి హాంకాంగ్ నుంచి సింగపూర్ మీదుగా భారత్లోకి తీసుకొచ్చినట్టు ఇంటెలిజెన్స్ సమాచారంతో గుర్తించారు. ఆ వాచీల్లో ఒకటి పాటెక్ ఫిలిప్ 5740, రెండోది బ్రెగ్యుట్ 2759. పాటెక్ ఫిలిప్ వాచ్కు మన దేశంలో ఎక్కడా డీలర్లు లేకపోవడం.. బ్రెగ్యుట్ కంపెనీల వాచీలు ఇండియా మార్కెట్లో స్టాక్ లేకపోవటంతో వారికి అనుమానం వచ్చింది. పరిశీలించి వాటి విలువ రూ.1.70 కోట్లపైగా ఉంటుందని తేల్చారు. దీంతో ముబీన్ను అరెస్టు చేసి, కోర్టు అనుమతితో విచారణ చేయగా మధ్యవర్తి నవీన్కుమార్ పేరును వెల్లడించారు.
మార్చి 12న అలోకం నవీన్కుమార్ను అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా మరిన్ని ఆధారాలు లభించినట్టు సమాచారం. ఈ రెండు వాచీలను హర్షరెడ్డి కోసం కొనుగోలు చేసినట్టు అధికారులు గుర్తించినట్టు తెలిసింది. ముబీన్ను లగ్జరీ వాచ్ డీలర్గా, నవీన్కుమార్ మధ్యవర్తిగా, హర్షరెడ్డి కొనుగోలుదారుడిగా అనుమానిస్తున్నారు. వాచీ కొనుగోలుకు యునైటెడ్ స్టేట్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ ది ట్రెజరీ (యూఎస్డీటీ)కి చెందిన టెథర్ వంటి క్రిప్టో కరెన్సీ ఆధారంగా కొంత డబ్బు, మరికొంత హవాలా రూపంలో చెల్లించినట్టు తేలిందని కస్టమ్స్ వర్గాలు జాతీయ మీడియాకు తెలిపాయి. ఈ నేపథ్యంలోనే హర్షకు నోటీసులు జారీ చేసినట్టు వెల్లడించాయి.
డబ్బున్న వ్యక్తులకు ఇలా ఖరీదైన వాచీలను సైప్లె చేయటంలో ముబీన్, నవీన్కుమార్ ఆరితేరినట్టు కస్టమ్స్ అధికారులు గుర్తించారు. విలాసాలకు అలవాటుపడిన వ్యక్తులకు ఇలా అక్రమమార్గంలో వాచీలను చేరవేస్తుంటారు. ఈ కేసులో మరింత లోతుగా విచారణ జరిపిన చెన్నై కస్టమ్స్ అధికారులు.. మార్చి 18న మద్రాస్ హైకోర్టుకు ఇచ్చిన వివరణలో లగ్జరీ వాచీల స్మగ్లింగ్ రూ.100కోట్లకుపైనే ఉంటుందని తెలిపారు. తనకు బెయిల్ ఇవ్వాలని నవీన్కుమార్ ముందస్తుగా పిటిషన్ వేయడంతో మద్రాస్ హైకోర్టు పిటిషన్ను కొట్టివేసింది. తదుపరి విచారణ నిమిత్తం హర్షరెడ్డిని విచారించాలని నిర్ణయించినట్టు తెలిసింది. కేసు దర్యాప్తులో తెలుగు రాష్ర్టాల నుంచి అక్రమ మార్గంలో ఖరీదైన వాచీలను పొందినవారి వివరాలు వెల్లడవుతాయని భావిస్తున్నారు.