నాగర్కర్నూల్, మే 24 : గతేడాది నాగర్కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి మండలం గంట్రావుపల్లి గ్రామ శివారులో హత్యకు గురైన చిక్కేపల్లి మల్లేశ్కు రాజకీయాలకు సంబంధం లేదని ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ శుక్రవారం ప్రకటనలో తెలిపారు. డిసెంబర్ 29వ తేదీన రాత్రి 8 గంటల సమయంలో అదే గ్రామానికి చెందిన చిక్కేపల్లి నరేశ్, అతడి బామ్మర్ది ఆడేంగిరి అలియాస్ గురువయ్య కలిసి భూ వివాదం విషయంలో తన భర్తను హత్య చేశారని మల్లేశ్ భార్య నిర్మల పోలీసులకు ఫిర్యాదు చేసింది.
పెద్దకొత్తపల్లి పోలీస్ స్టేషన్లో CrNo 203/2023 u/s 302 r/w 34 IPC కింద కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. చిక్కేపల్లి మల్లేశ్, చిక్కేపల్లి నరేశ్ మధ్య సర్వే నంబర్ 499లో ఉన్న ఎకరా భూమి విషయంలో భూ తగాదాలు, పాత కక్షలు ఉన్నందున.. వీటిని మనస్సులో పెట్టుకొని నరేశ్.. అతడి బామ్మర్ది గురువయ్య, జే మల్లయ్య సాయంతో మల్లేశ్ను హత్య చేసినట్టు దర్యాప్తులో తేలిందని చెప్పారు.
నేరస్తులను నిరుడు డిసెంబర్ 31వ తేదీన అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించామని, ఈ ఏడాది మార్చి 2వ తేదీన అంతిమ రిపోర్టును కూడా కోర్టులో సమర్పించామని తెలిపారు. గురువారం కొంత మంది రాజకీయ నాయకులు ప్రెస్మీట్ నిర్వహించి చిక్కేపల్లి మల్లేశ్ హత్య కూడా రాజకీయ కోణంలోనే జరిగిందని చెప్పడం విచారకరమని అన్నారు.