వట్టిపోయిన చెరువులు.. శిలాఫలకాలకే పరిమితమైన ప్రాజెక్టులు.. చిన్నబోయిన చిన్ననీటివనరులు.. 60 ఏండ్ల సమైక్యపాలనలో పాలమూరు దగాపడింది. సాగునీటివ్యవస్థ దారుణంగా ధ్వంసమైంది. అందుకే ఆరుదశాబ్దాల ఉమ్మడిపాలనలో పాలమూరు నీటినిల్వ సామర్థ్యం ఏడు టీఎంసీలు మాత్రమే. అందుకే కరువునేలగా మిగిలింది. పొరుగు రాష్ర్టాలకు వలసబోయింది.
స్వరాష్ట్రంలో సాగునీటి వ్యవస్థ సంపూర్ణంగా మారిన జిల్లా పాలమూరే. పెండింగ్ ప్రాజెక్టుల పూర్తి, మహాబలి లాంటి పాలమూరు-రంగారెడ్డి దూకుడు.. వెరసి పదేండ్లలో పాలమూరు జిల్లా ప్రాజెక్టుల నీటినిల్వ సామర్థ్యం పదింతలైంది.
ఇది సీఎం కేసీఆర్ విజన్ ఫలితం! సాగునీటి ప్రాజెక్టుల రీడిజైన్ ఫలం!
వర్షాలు కురిసే 60 నుంచి 70 రోజుల కాలంలోనే వరద నీటిని ఒడిసిపట్టాలి. వాటితోనే సాగునీటి అవసరాలు తీర్చుకోవాలి. ఇందుకోసం భారీ ప్రాజెక్టులు కట్టాలి. కానీ, తెలంగాణలో ఉమ్మడి పాలనలో సమైక్య పాలకుల కుట్రలతో ఒక్క భారీ తరహా ప్రాజెక్టుకూడా నిర్మాణానికి నోచుకోలేదు. కృష్ణా బేసిన్లో పరిస్థితి అయితే మరీ దయనీయం. వరద.. ఆ వెంటే నీటి కరువు. ఫలితంగా ఉమ్మడి పాలమూరు వలసబాటపట్టింది. సమైక్యపాలనలో అరిగోసలు అనుభవించింది. సీఎం కేసీఆర్ విజన్తో ఆ పరిస్థితికి ఇప్పుడు కాలం చెల్లనున్నది.
కేసీఆరే స్వయంగా రూపకల్పన చేసిన పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంతో కరువు నేలకు కృష్ణమ్మ బిరబిరా నడిచి రానున్నది. ఏండ్లుగా సాగునీటి గోస అనుభవిస్తున్న పాలమూరు గడ్డపై ఏడాది పొడవునా జలనిధి కనిపించనున్నది. సమైక్య పాలకులు చచ్చీ చెడి పూర్తిచేసింది ఒక్క జూరాల ప్రాజెక్టు మాత్రమే. 11 టీఎంసీల సామర్థ్యంతో దీన్ని నిర్మించినా.. ఇందులో నిల్వ ఉండే నీటి సామర్థ్యం కేవలం ఏడు టీఎంసీలే. స్వరాష్ట్రంలో ఈ నీటి నిల్వ సామర్థ్యం పీఆర్ఎల్ఐ పథకంతో ఏకంగా 67.94 టీఎంసీలకు పెరగనున్నది. కేసీఆర్ సంకల్పంతో కేవలం పదేండ్లలోనే నీటి నిల్వ సామర్థ్యం పదింతలు పెరుగుతుండడం విశేషం.
PRLIS | హైదరాబాద్, సెప్టెంబర్ 7 (నమస్తే తెలంగాణ): ఒక ప్రాజెక్టు మనుగడ, సద్వినియోగం చేసుకోవడంలో నీటి నిల్వ సామర్థ్యం అత్యంత కీలకభూమిక పోషిస్తుంది. నదుల్లో నీటి ప్రవాహం సంవత్సరమంతా ఉండదు. 90 శాతానికిపైగా వరద నైరుతి రుతుపవనాలవల్లే ఉంటుంది. ఆ వర్షపాతం కూడా నాలుగు నెలలూ సమంగా ఉండదు. తెలంగాణలోని కృష్ణా, గోదావరి నదుల పరివాహక ప్రాంతమంతా దాదాపు వర్షపాతంపైనే ఆధారపడి ఉంటుంది. ఒకో ఏడాది చాలా తకువ వర్షపాతం నమోదయ్యి కరువు నెలకొనే పరిస్థితి ఉంటుంది. వర్షాకాలంలో భారీగా వర్షాలు పడిన సంవత్సరాల్లో కూడా వర్షపాతం సమంగా ఉండక మధ్యలో రెండు మూడు వారాలు, ఒకోసారి నెలన్నరకు పైగా ఒక వర్షపు చుకకూడా రాలని పొడి పరిస్థితులు నెలకొని ఉంటాయి.
ఈ సంవత్సరమే అందుకు ప్రత్యక్ష ఉదాహరణగా చెప్పుకోవచ్చు. అలాంటి సందర్భాల్లో సాగు, తాగునీటికి రైతులు, ప్రజలు అల్లాడిపోకుండా ఉండాలంటే వరదను ఒడిసిపట్టడమే ఏకైక మార్గం. అందుకే జాతీయ జలవనరుల అభివృద్ధికమిషన్ (1999) వర్షాకాలంలో పడేనీటిని మిగిలిన సమయాల్లో వినియోగించుకొనేందుకు రిజర్వాయర్లు, ట్యాంకుల నిర్మాణం ద్వారా నిలువ సామర్థ్యం పెంచుకోవాలని గతంలోనే సూచించింది. నిల్వ ఉంటే వర్షాభావ సంవత్సరాల్లో నీటిని వినియోగించుకొనే అవకాశముంటుందని తెలిపింది. స్టోరేజీల ఆవశ్యకతను బచావత్ ట్రిబ్యునల్, బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునళ్లు కూడా తమ రిపోర్టుల్లో నొక్కిచెప్పాయి. బచావత్ 75శాతం డిపెండెబిలిటీ నీళ్లు అంటే నాలుగేళ్లలో మూడు సంవత్సరాలు నమ్మకంగా వచ్చేవి మాత్రమే. కాబట్టి నీళ్లు నిల్వ (స్టోరేజీ) ఉంచుకొనే రిజర్వాయర్లు ఉన్నటె్లైతే నాలుగేండ్లలో మూడేండ్లు కాకుండా దాదాపు నాలుగేండ్లు నీళ్లు వాడుకునే వెసులుబాటు ఈ నిల్వ సామర్థ్యం (క్యారీ ఓవర్ స్టోరేజీ) వల్ల కలుగుతుందని స్పష్టం చేశాయి.
సీఎం కేసీఆర్ దార్శనికత
ఆంధ్రప్రదేశ్లో విలీనమైన కారణాన, ఉమ్మడి పాలకుల వివక్ష మూలాన కోల్పోయిన నీళ్లను ఒడిసిపట్టేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ దార్శనికతతో ప్రాజెక్టుల రీఇంజినీరింగ్ చేపట్టారు. తెలంగాణలోని అన్ని ప్రాంతాలకు సాధ్యమైనంత మేర నీటిని అందించేలా ప్రణాళికలను రూపొందించారు. ఈ నేపథ్యంలోనే కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా భారీ రిజర్వాయర్లను నిర్మించారు. మొత్తంగా నీటి నిల్వ సామర్థ్యాన్ని 147 టీఎంసీలకు పెంచారు. అదే విధానాన్ని పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలోనూ అనుసరించడం విశేషం. ఈ ప్రాజెక్టులో భారీ రిజర్వాయర్లను నిర్మించారు. కృష్ణా బేసిన్లో చాలా వరకూ అన్ని లిఫ్టు సీంలు కావడంతో నీటి నిల్వ ఎకువగా ఉంచుకోవాల్సిన అవసరం మరింతగా ఉన్నది. పంపులు, మోటర్లు ఏదైనా కారణం వల్ల కొన్ని రోజులు నడవకుంటే ఆ నీటిపైనే ఆధారపడ్డ రైతులకు విపతర పరిస్థితులు ఎదురుకాకుండా కావల్సినంత నీటి నిల్వ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. పెద్ద పెద్ద లిఫ్ట్ సీంలు కొన్ని వందల కిలోమీటర్లు ప్రయాణించి, కొన్ని లక్షల ఎకరాలకు సాగునీరందించాలి కాబట్టి.. రిజర్వాయర్లలో నీటి నిల్వ సామర్థ్యం ప్రాధాన్యత మరింత పెరిగింది. ఆ దిశలోనే సీఎం కేసీఆర్ స్వయంగా అహోరాత్రులు శ్రమించి, ప్రాజెక్టుల రీఇంజినీరింగ్ చేశారు. రైతులకు ఎకువ నీటిని అందించేందుకు సాధ్యమైనంత నీటి నిలువ సామర్థ్యాన్ని పెంచుతూ రిజర్వాయర్ల నిర్మాణాన్ని చేపట్టారు. రాష్ట్ర ఏర్పాటు నాటికి కృష్ణా బేసిన్లో జూరాల ప్రాజెక్టులో మొత్తం తెలంగాణ నీటి నిల్వ సామర్థ్యం 7 టీఎంసీలు కాగా, ప్రస్తుతం నిర్మిస్తున్న ఒక్క పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకంతోనే 67.97 టీఎంసీల నిల్వ సామర్థ్యం పెరుగుతుండడం విశేషం. ఇవిగాకుండా ఇప్పటికే చెక్డ్యామ్లు, చెరువుల పునరుద్ధరణతోనూ కృష్ణా బేసిన్లో నీటినిల్వ సామర్థ్యాన్ని పునరుద్ధరించారు.
ఉమ్మడి పాలకుల నయవంచన
ఈ విషయంలో ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ తీవ్ర వంచనకు గురైంది. నాటి పాలకులు ఏపీలో నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచుకున్నారే తప్ప తెలంగాణ భూభాగంలో ఎక్కడా నీటి నిల్వను పట్టించుకోలేదు. ప్రాజెక్టులు, ఎత్తిపోతల పథకాలు చేపట్టినా కూడా వాటిలో నీటినిల్వకు భారీ రిజర్వాయర్లను ప్రతిపాదించలేదు. ఉమ్మడి ఏపీలో మేజర్, మీడియం ప్రాజెక్టుల నిల్వ సామర్థ్యం మొత్తంగా 1,232 టీఎంసీలు ఉంటే, అందులో ఏపీలో 827 టీఎంసీలు, తెలంగాణలో 302 టీఎంసీలు మాత్రమే కావడం వివక్షకు నిదర్శనంగా నిలుస్తున్నది. వాస్తవానికి భౌగోళిక, వాతావరణ పరిస్థితుల దృష్ట్యా నీటి నిల్వ సామర్థ్యం ఎకువగా తెలంగాణలోనే ఉండాల్సిన అసరమున్నది. కానీ దాన్ని సీమాంధ్ర ప్రభుత్వాలు పట్టించుకోలేదు. అందుకు కృష్ణా నదిపై ఉన్న జూరాల ప్రాజెక్టే ప్రత్యక్ష ఉదాహరణ. జూరాల ప్రాజెక్టుకు ట్రిబ్యునల్ కేటాయించిన నీళ్లు 17.84 టీఎంసీలు. దాని కింద ప్రతిపాదించిన ఆయకట్టు ఒక లక్ష ఎకరాలు. రిజర్వాయర్లో గరిష్ట నిల్వ సామర్థ్యం 11.94 టీఎంసీలు. కానీ 6.8 టీఎంసీలు మాత్రమే వినియోగించుకొనే అవకాశమే ఉంది. నికరంగా ప్రాజెక్టు కింద కనీసం 70 వేల ఎకరాలకు, అదీ ఒక పంటకు కూడా నీరందని దుస్థితి నెలకొన్నది.