హైదరాబాద్ సిటీబ్యూరో, మే 11 (నమస్తే తెలంగాణ): అతడు అబ్బాయి. కానీ, అమ్మాయిలా వల విసిరాడు. ఫేస్బుక్లో మరో అబ్బాయిని ప్రేమించి, పెండ్లి చేసుకొంటానని నమ్మించి, రూ.45 లక్షలు కాజేశాడు. ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా నూజివీడుకు చెందిన మోతె అశోక్.. యూట్యూబ్లో క్రైమ్ న్యూస్ చూసి, మాస్టర్ ప్లాన్ వేశాడు. ఫేస్బుక్లో అమ్మాయి అవతారం ఎత్తాడు. ఇందుషా తుమ్మల పేరుతో 2020 ఫిబ్రవరిలో ఫేస్బుక్ ఖాతా తెరిచాడు. ప్రొఫైల్ పిక్చర్గా అందమైన అమ్మాయి ఫొటో పెట్టాడు. నిజంగా అమ్మాయే అని నమ్మిన హైదరాబాద్లోని జూబ్లీహిల్స్కు చెందిన ఓ యువకుడు ఫేస్బుక్లోనే తెగ ప్రేమించాడు. వాయిస్చేంజ్ యాప్ను ఉపయోగించి అశోక్ తాను అమ్మాయిననే భ్రమ కల్పించాడు.
అశోక్ ట్రాప్లో పడ్డ జూబ్లీహిల్స్ యువకుడు పెండ్లికి సిద్ధమయ్యాడు. ఇక్కడినుంచి అసలు కథ మొదలైంది. తన చదువులకు డబ్బు కావాలని మొదట 3 లక్షలు, ఆ తరువాత తన తల్లికి కరోనా వచ్చిందని రూ.10 లక్షలు, రెండోసారి తనకు కరోనా వచ్చిందంటూ రూ.15 లక్షలు ఇలా వివిధ కారణాలు చెప్తూ మొత్తం రూ.45 లక్షలు వసూలు చేశాడు. చివరకు బాధితుడు గత నెలలో సైబర్క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఇన్స్పెక్టర్ వెంకట్రామిరెడ్డి నేతృత్వంలోని బృందం దర్యాప్తు చేపట్టింది. దీంతో అశోక్ నాటకం బయటపడింది. నిందితుడిని నూజివీడులో అరెస్టు చేసి రూ.2 లక్షలు రికవరీ చేసినట్టు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ మీడియాకు వివరించారు.
సైబర్నేరాలతో జాగ్రత్త: సీపీ ఆనంద్
పెండ్లి పేరుతో, లోన్ యాప్ల పేరుతో ఇటీవల మోసాలు చేస్తున్నవారి సంఖ్య బాగా పెరుగుతున్నదని, వీటి పట్ల అప్రమత్తంగా ఉండాలని సీపీ ఆనంద్ సూచించారు.