హైదరాబాద్, జూలై 10 (నమస్తే తెలంగాణ) : విశాఖ పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి, ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి ఈ నెల 13 నుంచి గంగానది తీరంలో రుషికేష్లో చాతుర్మాస్య దీక్ష చేపట్టనున్నారు. గురు పూర్ణిమ పర్వదినాన వ్యాస పూజతో దీక్షకు అంకురార్పణ జరుగుతున్నదని శారదాపీఠం వర్గాలు తెలిపాయి. ఈ సందర్భంగా సాధువులు, సన్యాసులకు అన్నదానం నిర్వహించి దక్షిణలు సమర్పిస్తారని పేర్కొన్నాయి. గంగమ్మ తల్లికి నిత్య హారతులిచ్చి పూజలు చేస్తారని వెల్లడించాయి. స్వరూపానందేంద్రులు.. చాతుర్మాస్య దీక్షా కాలాన్ని తపోకాలంగా పరిగణిస్తారని, ఆదిశంకరుల వారి భాష్యాన్ని, గౌడ పాదాచార్యుల వారి కారికలను, సుదేశ్వరాచార్యుల వారి వార్తికలను పరిశోధనాత్మకంగా విచారించి పాఠాల రూపంలో జిజ్ఞాసులకు బోధిస్తారని శారదాపీఠం వర్గాలు వివరించాయి.