చిక్కడపల్లి/ హిమాయత్నగర్, జనవరి 3: భారత న్యాయ సంహిత చట్టంలోని హిట్ అండ్ రన్ కేసులకు సంబంధించిన 104 సెక్షన్(1), (2) లను తక్షణమే రద్దు చేయాలని పలు కార్మిక సంఘాలు డిమాండ్ చేశాయి. ఆల్ ఇండియా రోడ్ ట్రాన్స్పోర్ట్ ఫెడరేషన్ (ఏఐఆర్టీడబ్ల్యూఎఫ్) గ్రేటర్ సిటీ కమిటీ ఆధ్వర్యంలో బుధవారం సుందరయ్య పార్కునుంచి చిక్కడపల్లి మెట్రో స్టేషన్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి ఎం వెంకటేశ్ మాట్లాడుతూ.. డ్రైవర్ లేకుండా సమాజం అవసరాలు తీరవని, ప్రతిపాదనలు వెనక్కి తీసుకోక పోతే మోదీ బండిని ముందుకు కదలనీయమని హెచ్చరించారు. కార్యక్రమలో ఏఐఆర్డీడబ్ల్యూఎఫ్ ప్రతినిధులు కే అజయ్బాబు, జే కుమారస్వామి, సత్యనారాయణ, జీ రాములు, మోహన్ తదితరులు పాల్గొన్నారు.
బీపీటీఎంఎం ఆధ్వర్యంలో
భారతీయ ప్రైవేట్ ట్రాన్స్ ఫోర్ట్ మజ్దూర్ మహా సంఘం(బీపీటీఎంఎం) ఆధ్వర్యంలో బుధవారం ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో న్యాయ సంహిత చట్టం జిరాక్స్ పత్రాలను తగలబెట్టి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా బీపీటీఎంఎం జాతీయ ప్రధాన కార్యదర్శి రవిశంకర్ అల్లూరి మాట్లాడుతూ.. న్యాయ సంహిత చట్టాన్ని వెంటనే వెనక్కు తీసుకోవాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. సంఘం రాష్ట్ర కమిటీ నాయకులు హబీబ్, శంకర్, శ్రీనివాస్ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.
మోటార్ వాహన బిల్లు రద్దు చేయాలి
కేంద్రం మోటార్ వాహన చట్టాన్ని రద్దు చేయాలని తెలంగాణ రోడ్ ట్రాన్స్పోర్ట్ డ్రైవర్స్, వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు వీఎస్ బోస్, ప్రధాన కార్యదర్శి బీ వెంకటేశం డిమాండ్ చేశారు. బుధవారం హిమాయత్నగర్లోని ఎస్ఎన్రెడ్డి భవన్లో ఫెడరేషన్ సమావేశం జరిగింది. డ్రైవర్లను ఇబ్బందులకు గురిచేయాలని దురుద్దేశంతో హిట్ అండ్ రన్ చట్టాన్ని తీసుకొచ్చారని విమర్శించారు.