రవీంద్రభారతి, జూలై 23: కుల, మత విద్వేషాలతో దేశం కునారిల్లుతున్నదని రాష్ట్ర ఆబార్కీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖల మంత్రి వీ శ్రీనివాస్గౌడ్, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. దీని నుంచి దేశం బయటపడాలంటే ప్రజల్లో మానవత్వం పెరగాల్సిన అవసరం ఎం తైనా ఉన్నదని పేర్కొన్నారు. ‘నారాయణ గురూస్ విజన్ ఆఫ్ రెలిజియన్ అండర్ సోషల్ జస్టిస్’ అనే అంశంపై శనివారం రవీంద్రభారతిలో గురు ధర్మ ప్రచారణ సభ నిర్వహించిన జాతీయ సదస్సులో వారు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.
నారాయణ గురు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం శ్రీనివాస్గౌడ్, వినోద్కుమార్ మాట్లాడుతూ.. దేశం కోసం ఎనలేని త్యాగాలు చేసిన నారాయణ గురును యువత ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. విద్యతోనే దేశంలో మార్పు వస్తుందని, అందుకే స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ ఎస్సీ, ఎస్టీ, బీసీల కోసం ప్రత్యేక గురుకుల పాఠశాలలు, హాస్టళ్లను ఏర్పాటు చేశారని వివరించారు. నారాయణ గురు గొప్ప సామాజిక విప్లవకారుడని రాష్ట్ర మానవహక్కుల కమిషన్ చైర్మన్ జస్టిస్ జీ చంద్రయ్య కొనియాడారు. కార్యక్రమంలో మాజీ ఎంపీలు బూరనర్సయ్యగౌడ్, సీతారామ్ నాయక్, ఎమ్మెల్సీ గోరటి వెంకన్న, రిటైర్డ్ ఐఎఎస్ అధికారి డాక్టర్ జయప్రకాశ్ నారాయణ, సుప్రీంకోర్టు జ్యుడిషియల్ అకాడమీ మాజీ డైరెక్టర్ డాక్టర్ మోహన్ గోపాల్, ప్రొఫెసర్ గట్టు సత్యనారాయణ, పద్మశ్రీ అవార్డు గ్రహీత డాక్టర్ ఏ సాయిబాబాగౌడ్, బీసీ సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం తదితరులు పాల్గొన్నారు.