న్యూఢిల్లీ, మే 29: ప్రభుత్వరంగ సంస్థ బ్యాంక్ ఆఫ్ బరోడా(బీవోబీ) నిరాశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. గడిచిన ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో బ్యాంక్ రూ.1,047 కోట్ల నష్టం వచ్చింది. నూతన పన్ను చట్టం కోసం రూ.3,726 కోట్ల పన్ను చెల్లింపులు జరుపడంతో లాభాలపై ప్రతికూల ప్రభావం చూపిందని పేర్కొంది. మార్చి 2020 త్రైమాసికంలో బ్యాంక్ రూ.506 కోట్ల లాభాన్ని గడించింది. సమీక్షకాలంలో నికర వడ్డీ ఆదాయం 71 శాతం పెరిగి రూ.4,848 కోట్లకు చేరుకున్నట్లు బీఎస్ఈకి సమాచారం అందించింది. గత త్రైమాసికంలో స్థూల నిరర్థక ఆస్తుల విలువ 9.40 శాతం నుంచి 8.87 శాతానికి తగ్గగా, నికర ఎన్పీఏ కూడా 3.13 శాతం నుంచి 3.09 శాతానికి తగ్గింది. 2020-21 ఆర్థిక సంవత్సరానికిగాను రూ.828 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది.