హైదరాబాద్, అక్టోబర్ 29 (నమస్తే తెలంగాణ): ఏపీలో హైకోర్టు న్యాయమూర్తులు విచారించే కేసులకు సంబంధించిన సబ్జెక్టుల (రోస్టర్)ను మార్చారు. ఏపీ హైకోర్టుకు కొత్తగా నలుగురు జడ్జీలు రావడంతో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్సింగ్ ఠాకూర్ ఆదేశాల మేరకు ఈ మార్పులు జరిగాయి. వీటికి సంబంధించి శనివారం రాత్రి హైకోర్టు ఉత్తర్వులు జారీచేసింది. 2019 నుంచి దాఖలైన క్రిమినల్ రివిజన్ కేసులు, బెయిల్ పిటిషన్లు, మాజీ/ప్రస్తుత ఎమ్మెల్యేలు, ఎంపీల కేసుల విచారణను జస్టిస్ తల్లాప్రగడ మల్లికార్జునరావుకు కేటాయించారు. దీంతో స్కిల్ డెవలప్మెంట్ కేసులో బెయిల్ కోసం మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దాఖలు చేసుకున్న పిటిషన్లు జస్టిస్ మల్లికార్జునరావు జాబితాలోకి వచ్చాయి.