హైదరాబాద్, మే 20 (నమస్తే తెలంగాణ): చనాక కొరాట పంప్హౌస్లో అధికారులు మొదటి పంప్ డ్రై రన్ పనులు చేపట్టారు. ఆదిలాబాద్ సీఈ శ్రీనివాస్, ప్రభుత్వ ఎత్తిపోతల పథకాల సలహాదారు పెంటారెడ్డి, సీఎం ఓఎస్డీ శ్రీధర్రావు దేశ్పాండే ప్రత్యక్ష పర్యవేక్షణలో శుక్రవారం అర్ధరాత్రి వరకు కొనసాగింది. శనివారం డ్రై రన్ పూర్తికానున్నది. ఆదిలాబాద్ జిల్లాలో 51వేల ఎకరాలకు సాగునీరందించాలనే లక్ష్యంతో దశాబ్దాల క్రితం చనాక-కొరాట ప్రాజెక్టును రూపొందించారు. స్వరాష్ట్రం ఏర్పాటు తరువాత దీనిపై సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా దృష్టి సారించారు. 2016 ఆగస్టులో చనాక కొరాట బరాజ్తో పాటు పంప్హౌస్ నిర్మాణ పనులు ప్రారంభించారు. తాజాగా పంప్ హౌస్ నిర్మాణం పూర్తి కావడంతో పాటు మోటర్ల బిగింపు ప్రక్రియ కూడా తుదిదశకు చేరుకొన్నది. ఈ సీజన్లో ప్రాజెక్టు కింద 10 వేల ఎకరాలకు సాగునీరందించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఈ పంప్ హౌస్లో 12 మెగావాట్ల సామర్థ్యం కలిగిన 3 పంపులు, 5.5 మెగావాట్ల సామర్థ్యం కలిగినవి మూడు మొత్తంగా ఆరు పంపులను ఏర్పాటు చేయాల్సి ఉండగా, ఇప్పటికే నాలుగు పంపుల బిగింపు ప్రక్రియ పూర్తయింది. ఆదిలాబాద్ సీఈ శ్రీనివాస్, ప్రభుత్వ ఎత్తిపోతల పథకాల సలహాదారు పెంటారెడ్డి, సీఎం ఓఎస్డీ శ్రీధర్రావు దేశ్పాండే ప్రత్యేక పర్యవేక్షణలో అధికారులు డ్రైరన్ను ప్రక్రియను ప్రారంభించారు.