గీసుగొండ నమస్తే తెలంగాణ, సెప్టెంబర్ 17: దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం టెక్స్టైల్ పార్క్ నిర్మిస్తున్నదని, మౌలిక సదుపాయాలు భేష్గావున్నాయని కిటెక్స్ గార్మెంట్స్ చైర్మన్ సాబుజాకబ్ అన్నారు. శుక్రవారం ఆయన వరంగల్ జిల్లా గీసుగొండ మండలం శాయంపేట గ్రామంలోని టెక్స్టైల్ పార్కులో ప్రభుత్వం కేటాయించిన స్థలాన్ని పరిశీలించిన అనంతరం ఆయన మాట్లాడుతూ..కేరళ కేంద్రంగా నడుస్తున్న తమ కంపెనీ వెయ్యి కోట్ల రూపాయలతో ఇక్కడ ఏర్పాటు చేస్తున్న టెక్స్టైల్ పార్క్తో ప్రత్యక్షంగా 2 వేల మందికి, పరోక్షంగా మరో 2 వేల మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయన్నారు. రాష్ట్రంలోకి పరిశ్రమలు రావడానికి సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఎంతో కృషి చేస్తున్నట్లు, ప్రభుత్వం ప్రకటించిన ఇండస్ట్రీయల్ పాలసీ బాగుందని కితాబిచ్చిన ఆయన.. పరిశ్రమలకు సులువుగా అనుమతులు, ప్రోత్సాహకాలు ఇస్తుండటం వల్లనే ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చినట్లు ఆయన వివరించారు. ఈ సందర్భంగా టెక్స్టైల్ పార్క్లో విద్యుత్ సౌకర్యం. నీటి వసతి, తదితర పనుల వివరాలను టీఎస్ఐఐసీ అధికారులను అడిగి ఆయన తెలుసుకున్నారు.