హైదరాబాద్, మే 26 (నమస్తే తెలంగాణ): తుంగభద్ర డ్యామ్లో పూడిక పెరిగి పూర్తిస్థాయి నీటిని వినియోగించుకోలేని పరిస్థితుల నేపథ్యంలోనే ప్రస్తుతమున్న లోలెవల్ కెనాల్ (ఎల్ఎల్సీ)కి సమాంతరంగా మరో కాలువను తవ్వడంతోపాటు, 31 టీఎంసీల సామర్థ్యంతో ఉన్న నావలి రిజర్వాయర్ను 52 టీఎంసీలకు విస్తరించేందుకు కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రతిపాదనలను తెలంగాణ సర్కారు తోసిపుచ్చింది. ట్రిబ్యునల్-2 అవార్డు అమలులోకి వచ్చేంత వరకు ఆ ప్రాజెక్టుపై ముందుకుపోవద్దని బోర్డు మీటింగ్లో తేల్చిచెప్పింది. తుంగభద్ర రివర్ బోర్డు చైర్మన్ రాయ్పురే అధ్యక్షతన గురువారం వర్చువల్గా కొనసాగింది.
ఈ సమావేశానికి తెలంగాణ రాష్ట్ర సాగునీటి పారుదలశాఖ ఈఎన్సీ మురళీధర్, అంతర్రాష్ట్ర జలమండలి సీఈ మోహన్కుమార్, కర్ణాటక, ఏపీ రాష్ర్టాల ఇరిగేషన్ అధికారులు హాజరయ్యారు. కృష్ణా ట్రిబ్యునల్-2 అవార్డు అమలులోకి వచ్చేంత వరకూ ముందుకుపోవద్దని ఇరు రాష్ర్టాలకు తేల్చిచెప్పింది. అదేవిధంగా బచావత్ ట్రిబ్యునల్ తుంగభద్రకు అనేక షరతులను విధిస్తూ 230 టీఎంసీలను కేటాయించిందని తెలంగాణ ప్రభుత్వం గుర్తుచేసింది. ఇష్టారీతిన నీటి కేటాయింపులు చేసే అవకాశం బోర్డుకు లేదని వెల్లడించింది. ట్రిబ్యునల్-2 అవార్డు వచ్చేంతవరకు తుంగభద్ర బేసిన్లో కొత్త ప్రాజెక్టులేవీ చేపట్టవద్దని తెలంగాణ సర్కారు నొక్కిచెప్పింది. దీనిపై బోర్డు చైర్మన్ రాయ్పురే స్పందిస్తూ ముందుగా కర్ణాటక, ఏపీ రాష్ర్టాలు తమ ప్రతిపాదనలకు సంబంధించిన డీపీఆర్లను సమర్పించాలని, ఆ తరువాత ఈ అంశంపై చర్చిద్దామని సూచించారు.
అవార్డు మేరకు నీటి విడుదల చేపట్టాలి
వరద ఎక్కువగా వచ్చిన సందర్భంలో నీరు వృథాగా దిగువకు పోకుండా ఉండేందుకు తుంగభద్ర డ్యామ్కు సంబంధించిన అన్ని కాలువలకు పూర్తి సామర్థ్యం మేరకు నీటిని విడుదల చేయాలని, ఆ నీటిని గడిచిన మూడేండ్ల నీటి వినియోగాల కింద జమ కట్టాలని బోర్డు సమావేశంలో కర్ణాటక ప్రతిపాదించింది. దీనిపైనా తెలంగాణ సర్కారు ట్రిబ్యునల్-1 అవార్డు మేరకే నీటిని విడుదల చేయాలని బోర్డుకు తేల్చిచెప్పింది. ఇదిలా ఉండగా నిర్దేశిత నిష్పత్తి మేరకు తుంగభద్ర బోర్డులో తెలంగాణ అధికారులను నియమించాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. అందుకు బోర్డు సైతం సమ్మతించింది. తెలంగాణ ప్రతిపాదనపై ఏపీ మాత్రం మెలికపెట్టింది. బోర్డు నిర్వహణకు సంబంధించిన నిధులను సంవత్సరం వారీగా డిపాజిట్ చేయాలని, ఆ తరువాతనే తెలంగాణ అధికారుల నియామకానికి ఒప్పుకోవాలని వాదించింది.