హైదరాబాద్, ఫిబ్రవరి 16 (నమస్తే తెలంగాణ): కేంద్రంలో మోదీ సర్కారు రూ.వంద లక్షల కోట్ల అప్పు చేసిందనే విషయాన్ని మరిచి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలంగాణపై విమర్శలు చేస్తున్నారని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మండిపడ్డారు. 2014 నాటికి దేశ అప్పు రూ.55 లక్షల కోట్లు ఉంటే ఇప్పుడు దాదాపు రూ.155 లక్షల కోట్లకు చేరిందని తెలిపారు. అప్పుల విషయంలో తెలంగాణ ప్రభుత్వానికి, కేంద్ర సర్కారుకు పొంతనేలేదని పేర్కొన్నారు. గురువారం కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ తెలంగాణ అప్పులపై చేసిన వ్యాఖ్యలను కవిత ఖండించారు.
దేశంలో ఒకో వ్యక్తిపై మోదీ 3 రెట్ల అధిక అప్పును మోపారని ఆగ్రహం వ్యక్తంచేశారు. దేశంలో 8.5 కోట్ల మందికి జాబ్ కార్డులు ఉన్నాయని, వారికి ఉపాధి కల్పించే బాధ్యత కేంద్రంపై ఉందని పేర్కొన్నారు. కానీ, అనేక సాకులతో కేంద్రం ఉపాధి కార్మికుల జాబ్ కార్డులను తగ్గించి వారి పొట్టగొట్టే ప్రయత్నం చేస్తున్నదని, దేశ సంపదను పెద్దలకు దోచిపెట్టే కుట్ర చేస్తున్నదని మండిపడ్డారు. కొత్త రాష్ట్రానికి ప్రత్యేక అవసరాలు ఉంటాయని, దయచేసి అన్ని రకాలుగా ఆదుకోవాలని సీఎం కేసీఆర్ కోరినా కేంద్రం పట్టించుకోలేదని పేర్కొన్నారు. మెడికల్ కాలేజీల ఏర్పాటులోనూ వివక్ష చూపించిందని మండిపడ్డారు. రాష్ట్రాల అవసరాలను చూడకుండా కేంద్రం తన బాధ్యతలనుంచి తప్పించుకొంటున్నదని విమర్శించారు. కొత్త జిల్లాల్లో నవోదయ పాఠశాలలు, మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేసినా కేంద్రం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ఆర్థిక సర్వేలో తలసరి ఆదాయం వెల్లడించకపోవడం దారుణమని పేర్కొన్నారు.