కొత్తపల్లి, జూలై 17 : కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలంలోని ఎలగందుల బృహత్ పల్లె ప్రకృతివనం ఎంతో బాగున్నదని కేంద్ర బృందం ప్రతినిధులు ప్రశంసించారు. కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ ఉప కార్యదర్శి హెచ్ఆర్ మీనా, అదనపు కలెక్టర్ గరిమ అగర్వాల్ నేతృత్వంలో బృందం సభ్యులు వివేక్రాజ్, పంకజ్ శర్మ ఆదివారం ప్రకృతివనాన్ని సందర్శించారు. ఈ బృహత్ ప్రకృతివనం అద్భుతంగా ఉన్నదని, భావితరాలకు మార్గదర్శకంగా నిలుస్తున్నదని వారు కితాబిచ్చారు. ఈ సందర్భంగా పల్లె ప్రకృతి వనాన్ని సమర్థవంతంగా నిర్వహిస్తున్న ఎంపీడీవో శ్రీనివాస్రెడ్డితోపాటు ప్రజాప్రతినిధులను అభినందించారు. అనంతరం బృందం సభ్యులు మహిళా సంఘాలతో సమావేశమయ్యారు. వీరివెంట కేంద్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ జాయింట్ కమిషనర్ శ్రీనివాస్, డీఆర్డీవో శ్రీలత, డీపీవో వీరబుచ్చయ్య, సర్పంచ్ ఎల్దండి షర్మిల తదితరులు ఉన్నారు.