న్యూఢిల్లీ, జూలై 25: ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని దాదాపు అన్ని హామీలను నెరవేర్చామని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. మౌలిక సదుపాయాలు, విద్యా సంస్థల వంటి కొన్ని మాత్రమే మిగిలి ఉన్నాయని, వాటి పనులు కూడా జరుగుతున్నాయని లోక్సభలో కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యానంద రాయ్ మంగళవారం ప్రకటించారు. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని హామీల సంగతేమైందని తెలంగాణకు చెందిన మన్నె శ్రీనివాస్రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, ఏపీకి చెందిన కేశినేని శ్రీనివాస్, కే రామ్మోహన్నాయుడు, వైఎస్ అవినాశ్రెడ్డి ప్రశ్నించారు. వీరి ప్రశ్నకు మంత్రి నిత్యానందరాయ్ సమాధానమిచ్చారు. ఏపీ, తెలంగాణకు చెందిన ఉమ్మడి సమస్యలను ఆ రెండు రాష్ర్టాల సహకారంతోనే పరిష్కరించాలన్నదే కేంద్ర విధానమని తెలిపారు. ఉమ్మడి సమస్యల పరిష్కారంలో కేంద్రం మధ్యవర్తి పాత్ర మాత్రమే పోషిస్తుందని స్పష్టంచేశారు. ‘చట్టంలోని ప్రతి అంశంపై రెండు రాష్ర్టాలకు చెందిన సంబంధిత శాఖలు, అధికారులతో కేంద్ర హోంశాఖ ఎప్పటికప్పుడు సమీక్షలు జరుపుతూనే ఉన్నది. ఇప్పటివరకు 31 సార్లు సమీక్షలు నిర్వహించాం’ అని వివరించారు.