కేంద్ర ఆహార శాఖ కార్యదర్శి అబద్ధాల పర్వం
ఎఫ్సీఐ ఎన్నడూ వడ్లు నేరుగా కొనలేదట
దేశమంతా ఒకే కొనుగోలు విధానం ఉన్నదట
తెలంగాణ, ఏపీల్లో ఒకే వాతావరణమట
బియ్యం ఎగుమతికి రాష్ర్టాలకు ఆటంకాలు లేవట
బియ్యంపై ఏ రాష్ట్రమూ ఇబ్బంది పడటం లేదట
హైదరాబాద్, ఏప్రిల్ 11 : నవ్వి పోదురు గాక నాకేటి సిగ్గు.. అన్న చందంగా ఉన్నది కేంద్రం ప్రభుత్వం వైఖరి. ధాన్యం సేకరణ నుంచి తప్పించుకొనేందుకు కేంద్ర ఆహార, పౌరసరఫరాల శాఖ కార్యదర్శి సుధాంశు పాండే నిజాలను దాచి నిస్సిగ్గుగా అబద్ధాలు వల్లె వేశారు. కేంద్ర అసమర్థతను కప్పిపుచ్చేందుకు తెలంగాణపై నిందలు వేసే ప్రయత్నం చేశారు. సోమవారం ఢిల్లీలో మీడియా సమావేశం నిర్వహించి తెలంగాణపై తప్పుడు ప్రచారం చేశారు. హైదరాబాద్లో ఎఫ్సీఐ రీజినల్ మేనేజర్ దీపక్ శర్మ కూడా అవే అబద్ధాలు చెప్పడం గమనార్హం. గతంలో నేరుగా ధాన్యం కొనుగోలు చేసిన విషయాన్ని దాచి తామెప్పుడూ ధాన్యం కొనలేదని బుకాయించారు. వారు చెప్పిన అబద్ధాలు, అసలు వాస్తవాలు ఏంటో పరిశీలిద్దాం..
అబద్ధం : ధాన్యం సేకరణలో దేశమంతటా ఒకే విధానం అమలు చేస్తున్నాం. ఎవరిపై వివక్ష లేదు.
వాస్తవం: దేశంలో ఒకే విధమైన ప్రొక్యూర్మెంట్ విధానం అమల్లో లేదు. కేంద్రం పంజాబ్, ఛత్తీస్గఢ్, ఉత్తరప్రదేశ్తో పాటు పలు రాష్ర్టాల్లో రెండు పంటలు (వరి, గోధుము) కొంటున్నది. తెలంగాణలో ఒకే పంట కొంటామంటున్నది. రెండో పంటకు షరతులు పెడుతున్నది. పంజాబ్లో మొత్తం ధాన్యం కేంద్రం కొనుగోలు చేసి 100 శాతం ఇతర రాష్ర్టాలకు పంపిణీ చేస్తున్నది. వాళ్లు పండించిన ధాన్యం వాళ్లు తినడం లేదు తెలంగాణలో పండిన ధాన్యంలో 50% రాష్ట్రం వినియోగించుకొంటుండగా 50% కేంద్రం తీసుకొంటున్నది. ఆ 50 శాతం తీసుకోవడంలోనూ ఇబ్బందులు పెడుతున్నది.
అబద్ధం: కేంద్రం నేరుగా వడ్లు కొనుగోలు చేయదు.
వాస్తవం: కేంద్రం ధాన్యం కొనుగోలు చేయలేదనడం పూర్తిగా అవాస్తవం. 2014కు ముందు ఎఫ్సీఐ మిల్లర్లతో ఒప్పందం చేసుకొని నేరుగా ధాన్యం కొనుగోలు చేసేది. ఈ విషయం ప్రస్తుత కేంద్ర ఆహార, పౌరసరఫరాల శాఖ కార్యదర్శి సుధాంశు పాండేకు తెలియదా? దాదాపు అన్ని పంట ఉత్పత్తులను ముడి పదార్థాలనే (రా ప్రొడక్ట్స్) కొనుగోలు చేస్తూ ధాన్యం విషయానికి వచ్చేసరికి బియ్యం కావాలని పట్టుబట్టుతున్నది. పంజాబ్ నుంచి నేరుగా గోధుమలనే కొంటున్నది. అంతేగానీ గోధుమ పిండిని సేకరించడం లేదు. కందులు, శనగలు తదితర పంట ఉత్పత్తులను రా ప్రొడక్ట్స్గానే నేరుగా ఎమ్మెస్పీకి కొనుగోలు చేస్తున్నది. ఇక్కడ కూడా వడ్లే తీసుకోవచ్చు కదా?
అబద్ధం : ఏపీ, తెలంగాణలో ఒకే వాతావరణ పరిస్థితులు ఉన్నాయి. అలాంటప్పుడు ఏపీలో లేని ఇబ్బందులు తెలంగాణలో ఎందుకు వస్తున్నాయి?
వాస్తవం: ఏపీ, తెలంగాణలో రబీ సీజన్లో వాతావరణంలో చాలా వ్యత్యాసం ఉంటుంది. తెలంగాణలో మార్చి, ఏప్రిల్ నాటికే 40 డిగ్రీలకు మించి ఉష్ణోగ్రత్తలు నమోదవుతాయి. ఏపీలో 35 డిగ్రీలకు మించవు. అదీగాక సముద్రతీర ప్రాంతం కావటంతో వాతావరణంలో తేమ చాలా ఎక్కువగా ఉంటుంది. దీంతో అక్కడ ధాన్యం తడిగా ఉండి నూక శాతం తక్కువగా వస్తుంది. ఏపీలో వ్యవసాయం ఎక్కువగా కాలువ నీళ్లపై ఆధారపడి ఉంటుంది. తెలంగాణలో బోర్లు, బావుల పారకంపై ఆధారపడి ఉన్నది. కాలువ నీళ్ల పారకంతో ఎక్కువ నీళ్లు అంది వడ్లు తడిగా ఉండి నూక తక్కువ వస్తుంది. తెలంగాణలో ఆ పరిస్థితి లేకపోవడంతో వడ్లు ఎండి విరిగిపోతాయి. ఇవేవి గుర్తించని సుధాంశు సులువుగా అబద్ధాలు చెప్పారు. చెప్పేస్తున్నారు.
అబద్ధం: బియ్యాన్ని ఎగుమతి చేసేందుకు రాష్ర్టాలకు ఎలాంటి ఆటంకాలు లేవు.
వాస్తవం: ఎగుమతుల విధానం పూర్తిగా కేంద్రం చేతిలో ఉన్నది. రాష్ర్టాలకు ఎగుమతి వ్యవస్థ ఉండదు. అదేవిధంగా రాష్ర్టాలకు ఆధునిక వసతులతో కూడిన గోదాములు ఉండవు. దీంతో ఎగుమతి కోసం పంట ఉత్పత్తులను కొనుగోలు చేసి రాష్ట్రం ఎక్కడ నిల్వ చేయాలి? వాటిని ఎలా ఎగుమతి చేయాలి?
అబద్ధం: ఎవరూ వినియోగించని బాయిల్డ్ రైస్ కొని ఏం చేసుకోవాలి? బాయిల్డ్ రైస్ కొంటే ప్రజా ధనం వృథా అవుతుంది.
వాస్తవం: విదేశాల్లో మన బాయిల్డ్ రైస్కు భారీ డిమాండ్ ఉన్నది. ఇలాంటప్పుడు కేంద్రం బాయిల్డ్ రైస్ ఎగుమతులపై ఎందుకు దృష్టి పెట్టడం లేదు? ఎందుకు ప్రోత్సహించడం లేదు? రైతుల పంటల కొనుగోలును కూడా వ్యాపార కోణంలో చూసే ఏకైక సర్కారు మోదీ ప్రభుత్వమే. రైతుల పంటలను కొనుగోలు చేస్తే ప్రజాధనం వృథా ఎలా అవుతుంది?
అబద్ధం: ధాన్యం కొనుగోళ్లలో ఏ రాష్ర్టానికి ఎలాంటి ఇబ్బంది లేదు.
వాస్తవం: ధాన్యం కొనుగోళ్లలో తమ అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి కేంద్ర ప్రయత్నిస్తున్నది. ఇందులో భాగంగానే ఏ రాష్ట్రంలోనూ ఇబ్బంది లేదని చెప్తున్నది. కానీ వరి పండించే మెజార్టీ రాష్ర్టాలు కేంద్రం విధానంతో తీవ్రంగా ఇబ్బంది పడుతున్నాయి. బాయిల్డ్ కొనుగోలు చేయబోమన్న కేంద్రం వైఖరిని నిరసిస్తూ ఛత్తీస్గఢ్ ప్రభుత్వం ప్రధాని మోదీకి లేఖ రాసింది. మహారాష్ట్ర, తమిళనాడు ప్రభుత్వాలు కూడా ఇబ్బంది పడుతున్నాయి.
అబద్ధం: కేంద్రం ఎప్పుడూ బాయిల్డ్ రైస్ను ప్రోత్సహించలేదు.
వాస్తవం: కేంద్ర బాయిల్డ్ రైస్ ప్రోత్సహించలేదనడానికి మించిన అబద్ధం లేదు. 2014 నుంచి కేంద్ర ప్రభుత్వం స్వయంగా బాయిల్డ్ మిల్లుల ఏర్పాటును ప్రోత్సహించింది. ఇందుకోసం పెట్టుబడిలో 15 శాతం రాయితీ కూడా ఇచ్చింది. ఇప్పుడేమో తమకేమీ సంబంధం లేదం టూ పచ్చి అబద్ధాలు చెప్తున్నది. 2014 నాటికి రాష్ట్రంలో కేవలం రెండు మూడు వందల బాయిల్డ్ మిల్లులు ఉంటే ఇప్పుడు ఏకంగా 1,500కు పెరిగాయి. ఇదంతా కేం ద్ర ప్రోత్సాహం వల్లే జరిగింది. ఇప్పుడు బాయిల్డ్ రైస్ వద్దంటూ ఆ మిల్లుల మూతకు కారణం అవుతున్నది.