సూర్యాపేట : విద్యుత్ సంస్కరణల పై కేంద్రం వెనకడుగు అంటూ వస్తున్న కథనాలు ముమ్మాటికి మోసపురితమైనవని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి ఆరోపించారు. ప్రజల్లో వస్తున్న వ్యతిరేకతను గుర్తించిన మీదటనే కేంద్రంలోని బీజేపీ సర్కార్ ఇలాంటి లీకేజీలు ఇస్తుందంటూ ఆయన మండిపడ్డారు.
గురువారం జిల్లా కేంద్రంలో మంత్రి మీడియా సమావేశంలో మాట్లాడుతూ..బీజేపీ విధానాలపై ఫైర్ అయ్యారు. వ్యవసాయ చట్టాల విషయంలోనూ గతంలో ఇదే జరిగిందని ఆయన ఆరోపించారు. కొత్తగా తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకున్నట్లు కేంద్రం ప్రకటించినప్పటికీ..తదనంతర కాలంలో మళ్లీ అవే చట్టాలు తీసుకొస్తామంటూ బీజేపీ నేతలు చేస్తున్న ప్రకటనలను ఆయన గుర్తు చేశారు.
సంస్కరణల మార్పు విషయమై రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి సమాచారం లేదన్నారు. సంస్కరణలను ప్రతిపాదించిన రోజున కేంద్రం పంపిన దానికి ప్రభుత్వ వైఖరిని ముఖ్యమంత్రి కేసీఆర్ లేఖ ద్వారా స్పష్టంగా తెలియజేశారని మంత్రి గుర్తు చేశారు.
తాజాగా వస్తున్న లీకేజీల పై కేంద్రం రాష్ట్రాన్ని సంప్రదించిన పక్షంలో ప్రజల గొంతుకకు అనుగుణంగా సీఎం కేసీఆర్ నిర్ణయం ఉంటుందన్నారు. విద్యుత్, వ్యవసాయ చట్టాలు దేశ ప్రజలకు గొడ్డలి పెట్టు లాంటివని ఆయన చెప్పారు.