హైదరాబాద్ : ఆన్లైన్ ఆడిట్లో తెలంగాణ దేశంలోనే అద్భుత ప్రతిభను కనపరచిన రాష్ట్రం అని కేంద్ర పంచాయితీరాజ్శాఖ జాయింట్ సెక్రటరీ కె యస్ సేథీ అభినందించారు. ఆర్ధికశాఖ సూచనలతో తెలంగాణలో ఆడిట్ శాఖ, పంచాయతీరాజ్ శాఖలు సమన్వయంతో పనిచేశాయని కొనియాడారు. త్వరలో కేంద్ర పంచాయితీరాజ్ శాఖ మంత్రి ఎదుట తెలంగాణ ఆడిట్ శాఖ సంచాలకులు మార్తినేని వెంకటేశ్వర రావు ఆన్లైన్ ఆడిట్ఫై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వాలని ఆయన కోరారు.
కేంద్ర ప్రభుత్వం నూతనంగా అమలు చేసిన ఆన్లైన్ ఆడిట్ విధానములో తెలంగాణ ఆడిట్శాఖ గ్రామ పంచాయితీల్లో లేవనెత్తిన ఆడిట్ అభ్యంతరాలఫై కేంద్రం స్పందించింది. ఈ మేరకు కె యస్ సేథీ తెలంగాణ ఆర్ధిక, ఆడిట్శాఖ, పంచాయతీరాజ్శాఖలకు శుక్రవారం లేఖ రాశారు. తెలంగాణలో 2019-20 ఆడిట్ సంవత్సరంలో 12,769 గ్రామపంచాయితీలకు గాను 5,174 గ్రామపంచాయితీలను ఆన్లైన్లో ఆడిట్ చేసి నివేదికలను, 56,505 అభ్యంతరాలని ఆన్లైన్లో ఆడిట్శాఖ అందించిందని తెలిపారు. ఆడిట్ శాఖ లేవనెత్తిన అభ్యంతరాలఫై సరైన సమాధానాలు రాయాలని కోరారు.
కరోనా సమయంలో 25 రాష్ట్రాలలోని పంచాయితీరాజ్ స్థానిక సంస్థలకు రూ. 8923.80కోట్లు నిధులు విడుదల చేసినట్లు తెలిపారు. ఈ గ్రాంట్ని 2020-21 ఆడిట్ సంవత్సరంలో ఆన్లైన్ ఆడిట్ చేయాలని కోరారు. ఆడిట్ నివేదికల ఆధారంగా రానున్న రోజుల్లో కేంద్రం నిధులు విడుదల చేయనున్నట్లు తెలిపారు.
ఇకఫై ఆన్లైన్లోనే గ్రామ పంచాయితీల ఆడిట్ నిర్వహించాలని కేంద్ర పంచాయితీరాజ్శాఖ జాయింట్ సెక్రటరీ సేథీ రాష్ట్రాలను ఆదేశించారు. వంద శాతం ఆన్లైన్లో గ్రామపంచాయితీలు ఆడిట్ చేసేలా తెలంగాణ ఆడిట్ శాఖ తీసుకుంటున్న చర్యలు ఇతర రాష్ట్రాలు పాటించేలా చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. ఆన్లైన్లో గ్రామ పంచాయితీలను ఆడిట్ చేయడంతో కేంద్రం నిధులు గ్రామ పంచాయితీలలో ఖర్చు చేస్తున్న విధానం తెలుసుకునేందుకు వీలు అవుతుందని, అవినీతికి తావు ఉండదన్నారు.
కేంద్ర పంచాయితీరాజ్శాఖ జాయింట్ సెక్రటరీ సేథీ లేఖ నేపథ్యంలో తెలంగాణ ఆర్ధికశాఖ మంత్రి హరీష్ రావు, ఆర్ధికశాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు గ్రామ పంచాయితీల ఆడిట్ ఆన్లైన్లోనే చేసేలా చూడాలని, అందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుని ఈ ఏడాది కూడా తెలంగాణ దేశంలోనే మొదటి స్థానంలో ఉండాలని తెలంగాణ ఆడిట్ సంచాలకులు మార్తినేని వెంకటేశ్వరరావుకు సూచించారు. ఈ ఏడాది రాష్ట్రంలోని 12,769 గ్రామపంచాయితీల ఆడిట్ ఆన్లైన్లో చేసేలా చర్యలు తీసుకున్నారు.