(స్పెషల్ టాస్క్ బ్యూరో)
Parcels | హైదరాబాద్, ఆగస్టు 14 (నమస్తే తెలంగాణ): బంధువులకు, స్నేహితులకు పోస్ట్ ద్వారా మీరు పంపించే పార్సిల్స్ను ఇకపై పోస్టాఫీస్ సిబ్బంది తెరిచి చూడొచ్చు. పార్సిల్లో ఉన్నవి వారికి అభ్యంతరకరమైనవిగా అనిపిస్తే వాటిని బట్వాడా చేయకుండా మూలకు పడేయొచ్చు. లేదా ఉన్నతాధికారులకు పంపించవచ్చు.
ఈ మేరకు ఇండియన్ పోస్ట్ ఆఫీస్ యాక్ట్, 1898 స్థానంలో కేంద్రప్రభుత్వం కొత్త పోస్టాఫీస్ బిల్లు, 2023ని ఇటీవల పార్లమెంట్ సమావేశాల్లో ప్రవేశపెట్టింది. దేశ భద్రత, పౌరుల రక్షణ కోసమే ఈ నిర్ణయం తీసుకొన్నట్టు ప్రభుత్వం చెప్పుకొచ్చింది. అయితే, కేంద్రం చర్యలపై హక్కుల కార్యకర్తలు, విపక్ష పార్టీ నేతలు మండిపడ్డారు. పౌరులకు వ్యక్తిగత స్వేచ్ఛ లేకుండా చేయడానికి, రాజకీయ ప్రయోజనాల్లో భాగంగానే కేంద్రం ఈ తరహా చర్యలకు దిగుతున్నదని ధ్వజమెత్తారు.