National Highways | హైదరాబాద్, మే 11 (నమస్తే తెలంగాణ): తెలంగాణ సర్కారుపై కేంద్రం అన్నిరంగాల్లోనూ వివక్ష చూపుతున్నది. రాష్ట్రంలోని 14 ప్రధాన రోడ్లకు జాతీయ రహదారుల (ఎన్హెచ్) గుర్తింపు కోసం రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ చేస్తున్న ప్రయత్నాలకు కేంద్రం నుంచి తీవ్రస్థాయిలో సహాయ నిరాకరణ ఎదురవుతున్నది. ఏండ్లు గడుస్తున్నా ఆర్అండ్బీ శాఖ ప్రతిపాదనలకు మోక్షం కల్పించకుండా తాత్సారం చేస్తున్నది. ఫలితంగా ప్రధాన ప్రాంతాల కనెక్టివిటీకి ఉద్దేశించిన ఈ రోడ్లపై వాహనదారులకు ఇబ్బందులు తప్పడంలేదు. దీంతో తాజాగా మరోసారి కేంద్రానికి రాష్ట్ర ఆర్అండ్బీ శాఖ లేఖ రాసింది.
తెలంగాణ ఏర్పాటు అనంతరం రాష్ట్రంలో జిల్లాల పెంపుతో కొత్త జిల్లా కేంద్రాలు ఏర్పాటయ్యాయి. పారిశ్రామికీకరణ భారీగా జరిగి, పలు ప్రాంతాలు ఇండస్ట్రియల్ జోన్లుగా మారాయి. దీంతో అక్కడ ఆర్థిక కార్యకలాపాలు, ఉపాధి అవకాశాలు పెరిగాయి. ఉమ్మడి రాష్ట్రంలో నిరాదరణకు గురైన అనేక చారిత్రక ఆలయాలను రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున అభివృద్ధి చేసింది. దీంతో ఆధ్యాత్మిక పర్యాటకం వృద్ధి చెందింది. రోజురోజుకూ పెరుగుతున్న అవసరాలకు తగ్గట్టుగా సరిహద్దు రాష్ర్టాలను అనుసంధానించే రోడ్లను కూడా మెరుగుపర్చాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. ఫలితంగా ఆయా ప్రాంతాలను కలిపే రోడ్లపై రాకపోకలు పెరిగి ట్రాఫిక్ ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
దీంతో ఆర్అండ్బీ శాఖ 14 ప్రధాన రోడ్లను గుర్తించి వాటికి ఎన్హెచ్ రోడ్లుగా గుర్తింపు ఇవ్వాలని కేంద్ర జాతీయ రహదారుల మంత్రిత్వశాఖకు దశలవారీగా ప్రతిపాదనలు పంపింది. ఇందులో 2015-16 నుంచి పంపిన ప్రతిపాదనలు కూడా ఉండడం గమనార్హం. ఎన్హెచ్ మంత్రిత్వశాఖకు చెందిన కార్యదర్శి రాష్ర్టాల ఆర్అండ్బీ శాఖల కార్యదర్శులతో తరచూ నిర్వహించే వీడియో కాన్ఫరెన్స్లలో కూడా రాష్ట్ర అధికారులు వీటి గురించి ప్రస్తావిస్తున్నారు. అయి నా కేంద్రం నుంచి ఉలుకూ పలుకూ ఉండటంలేదు. పలుసార్లు లేఖలు రాసినా స్పందించడం లేదు. దీంతో తాజాగా మరోసారి ఆర్అండ్బీ అధికారులు ఈ 14 రోడ్లను ఎన్హెచ్ రోడ్లుగా గుర్తించాలని కేంద్రానికి లేఖ రాశారు. ఈ 14 రోడ్ల పొడవు దాదాపు 1,656.6 కిలోమీటర్లు కాగా, వీటి అభివృద్ధితో రాష్ట్రంలో రోడ్లు నెట్వర్క్ మరింత బలోపేతమై ప్రజారవాణాతోపాటు సరుకు రవాణా, రాష్ర్టాల మధ్య అనుసంధానం మరింత మెరుగయ్యే అవకాశం ఉన్నది.
ప్రస్తుతమున్న ఈ రోడ్లను జాతీయ రహదారులుగా గుర్తించడంవల్ల నాలుగు లేన్లుగా విస్తరించే వీలుంది. ఇందులో అనేక కల్వర్టులు, బ్రి డ్జిలు నిర్మించాల్సి ఉంటుంది. భారీగానే భూసేకరణ చేయాలి. రోడ్లను జాతీయ రహదారులుగా గుర్తిస్తే రోడ్ల అభివృద్ధికి అయ్యే ఖర్చు కేం ద్రం భరించాల్సి ఉంటుంది. టోల్ ట్యాక్స్, పెట్రో ఉత్పత్తులపై విధిస్తున్న పన్నుల ద్వారా రాష్ట్రం నుంచి కేంద్రానికి భారీగా ఆదాయం సమకూరుతున్నది. దీన్ని బట్టి ఆర్అండ్బీ శాఖ పంపిన ప్రతిపాదనలను ఆమోదిస్తే కేంద్ర ఖజానాపై పెద్దగా భారం పడే అవకాశం కూడా ఉం డదని అధికారవర్గాలు చెప్తున్నాయి.
ప్రతిపాదిత 14 రోడ్లు అంతర్రాష్ట్ర రహదారులుగా కూ డా ఉపయోగపడే అవకాశం ఉండటంతో తక్షణమే వీటిని అభివృద్ధి చేయాల్సిన బాధ్యత కేం ద్రంపై ఉందని వారు స్పష్టం చేస్తున్నారు. కొన్ని రోడ్లను జాతీయ రహదారులుగా గుర్తించేందుకు ఎన్హెచ్ శాఖ ప్రాథమికంగా ఒప్పుకున్నప్పటికీ రాష్ట్రంలోని ఎన్హెచ్ శాఖకు చెందిన ప్రాంతీయ అధికారుల నిర్లక్ష్యంవల్ల ఆ ప్రతిపాదనలు ముందుకు సాగడంలేదని తెలుస్తున్నది. చౌటుప్పల్-సంగారెడ్డి, కరీంనగర్-పిట్లం, వనపర్తి-పిట్లం, సారపాక-ఏటూరునాగారం తదితర రోడ్లను జాతీయ రహదారులుగా ప్రకటించాలన్న ప్రతిపాదనలు 2015-16 నుంచి పెండింగులో ఉండడం గమనార్హం.