హైదరాబాద్, సెప్టెంబర్ 24 (నమస్తే తెలంగాణ): విభజించు, పాలించు అన్న సూత్రంతో కొనసాగిన బ్రిటీష్ పాలనను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తలపిస్తున్నదని రాష్ట్ర పోలీసు హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్ విమర్శించారు. దేశం రాష్ట్రాల సమాఖ్య అనే విషయాన్ని మరచిపోయి కేంద్రం తీసుకొంటున్న ఏకపక్ష నిర్ణయాలతో ప్రజలంతా ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
దేశ చరిత్రలోనే విష సంసృతిని ప్రవేశపెట్టిన ఘనత బీజేపీకే దకుతుందని శనివారం ఆయన ఒక ప్రకటనలో విమర్శించారు. లాభాల్లో ఉన్న ప్రభుత్వరంగ సంస్థలను తెగనమ్ముతు న్నదని, ఆ ఆదాయంలో ఒక పైసా కూడా సామాన్యుడికి అందడం లేదని విమర్శించారు. సీబీఐ, ఈడీలను వాడుకొంటూ విపక్షాలపై కక్షసాధింపు చర్యలకు దిగడమే బీజేపీ ఏకైక అజెండాగా మారిందని దుయ్యబట్టారు.
దేశంలో బలమైన ప్రతిపక్షం లేకపోవటంతోనే బీజేపీ ఆటలు సాగుతున్నాయని విమర్శించారు. ఈ పరిస్థితుల్లో ఆర్థిక, రాజకీయ సంక్షోభం నుంచి గట్టెక్కించి, అభ్యుదయ పథంలో నడిపించే ప్రగతిశీల నాయకుడి కోసం దేశం ఎదురుచూస్తున్నదని తెలిపారు. దేశం యావత్ తెలంగాణ వైపు చూస్తున్నదని, రాష్ర్టాన్ని ప్రగతిపథంలో నడిపిస్తున్న కేసీఆర్ దేశాన్ని సైతం అభివృద్ధి మార్గంలో నడిపించగలరని ప్రజలు విశ్వసిస్తున్నారని అన్నారు. దేశ సమైక్యత, అభివృద్ధి కోసం తపిస్తున్న కేసీఆర్తోనే భారత్ ప్రపంచంలోనే అగ్రగామి దేశంగా నిలబడడం ఖాయమని తాను విశ్వసిస్తున్నట్టు పేర్కొన్నారు.