బంజారాహిల్స్, డిసెంబర్ 11: విపక్షాలను వేధించేందుకు ఐటీ, ఈడీ, సీబీఐ లాంటి సంస్థలను పావులుగా వాడుకొంటున్న కేంద్ర ప్రభుత్వంపై రాష్ట్ర మేకలు, గొర్రెల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ దూదిమెట్ల బాలరాజ్యాదవ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కేంద్ర దర్యాప్తు సంస్థల దాడులతో బీఆర్ఎస్ పార్టీని దెబ్బతీయాలని చూస్తున్న నరేంద్రమోదీ సర్కార్ కుట్రలను సహించేది లేదని స్పష్టం చేశారు.
సీబీఐ అధికారులు ఆదివారం హైదరాబాద్లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నివాసానికి వచ్చి విచారణ చేపట్టడంతో ఆయన మీడియాతో మాట్లాడారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కవిత పేరును చేర్చేందుకు జరుగుతున్న కుట్రలను ప్రజలు గమనిస్తున్నారన్నారు. బీఆర్ఎస్ పార్టీని రాజకీయంగా ఎదుర్కోలేక మోదీ సర్కార్ పిరికిపంద చర్యలకు పాల్పడుతున్నదని మండిపడ్డారు. తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించడంతోపాటు తెలంగాణ జాగృతి ద్వారా తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలను ప్రపంచానికి చాటిచెప్పిన కవితను మానసికంగా వేధించాలన్న ప్రయత్నాలను మానుకోవాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. బీజేపీ కుటిలయత్నాలను తిప్పికొట్టేందుకు తెలంగాణ ప్రజలు సిద్ధంగా ఉన్నారని బాలరాజ్యాదవ్ తెలిపారు.