హైదరాబాద్, మార్చి 19 (నమస్తే తెలంగాణ) : సంచలనం సృష్టించిన సెలబ్రిటీ రిసార్ట్ కాల్పుల కేసులో కొత్త కోణం వెలుగు చూసింది. సొంత కూతురినే కిడ్నాప్ చేసేందుకు తన మాజీ భర్త సిద్దార్థ్ దాస్ ప్రయత్నించారని ఆయన మాజీ భార్య స్మిత మంగళవారం డీజీపీ రవిగుప్తాకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు విచారణ చేపట్టాలని సీఐడీ ఏడీజీ శిఖాగోయెల్ను డీజీపీ రవిగుప్తా ఆదేశించారు. 2003లో పెళ్లి చేసుకున్న సిద్ధార్థ్-స్మిత 2019 నుంచి విడిపోయి వేర్వేరుగా ఉంటున్నారు. కూకట్పల్లి ఫ్యామిలీ కోర్టులో విడాకులకు స్మిత పిటిషన్ వేశారు. వీరికి ఓ కొడుకు, కూతురు ఉన్నారు.
స్మిత సీరియల్ యాక్టర్ మనోజ్తో కలిసి ఉంటుందని అప్పట్లో వార్తలు వచ్చాయి. వీరిద్దరు కలిసి పలువురు అమ్మాయిలకు సినిమా, సీరియల్ అవకాశాలు ఇస్తామని చెప్పి మోసం చేసినట్లు పోలీసులు గుర్తించారు. సెలెబ్రిటీ రిసార్టులోని ఓ విల్లాలో ఉంటున్నప్పుడు మనోజ్ తనను వేధిస్తున్నాడని సిద్ధార్థ్ కొడుకు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ విషయంపై మాట్లాడేందుకు వెళ్లిన సిద్ధార్థ్దాస్పై ఎయిర్ గన్తో మనోజ్ కాల్పులు జరిపారు. అయితే తాజాగా సిద్దార్థ్ దాస్ స్నేహితుడు అడ్వకేట్ అలీ తన కూతురిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని స్మిత డీజీపీకి ఫిర్యాదు చేసింది. కూతుర్ని కిడ్నాప్ చేయడానికి సిద్ధార్థ్ ప్రయత్నించాడని ఆమె ఫిర్యాదులో పేరొన్నది.