చిట్యాల, మారి 13: నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డు రావటంతో సినీగేయ రచయిత చంద్రబోస్ స్వగ్రామం జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం చల్లగరిగెలో సంబురాలు మిన్నంటాయి. స్నేహితులు, గ్రామస్థులు, శిష్యులు, ఆత్మీయులు, కళాకారులు పటాకులు పేల్చి, కేక్లు కట్ చేశారు. కనుకుంట్ల నర్సయ్య, మధునమ్మ నాలుగో సంతానంగా జన్మించిన చంద్రబోస్.. సినీ పాటల రచయితగా దేశం గర్వించే స్థాయికి ఎదిగారు. ఆయన తండ్రి ఉపాధ్యాయుడిగా పనిచేశారు. చంద్రబోస్కు ఇద్దరు అన్నలు, ఒక అక్క. ఊరిలోని ప్రభుత్వ పాఠశాలలో చదివి, జేఎన్టీయూలో ఇంజినీరింగ్ పట్టా పొందారు. విద్యాభ్యాసం పూర్తయ్యాక దూరదర్శన్లో గాయకుడిగా, 1993లో తాజ్మహల్ సినిమాతో సినీగేయ రచయితగా తన ప్రస్థానాన్ని ప్రారంభించారు. చంద్రబోస్కు భార్య సుచిత్ర, కుమారుడు వనమాలి, కూతురు అమృత వర్షిణి ఉన్నారు. ఆర్ఆర్ఆర్ సినిమాకు నాటు నాటు పాటను అందించిన ఆయన.. ఆస్కార్ అవార్డు గెలుచుకొని భారతీయ సినిమా పాటను విశ్వవ్యాప్తం చేశారు.