టీహబ్ ప్రత్యేకతలను సీఎంకు వివరించిన మంత్రి కేటీఆర్
ఉదయం నుంచి రాత్రి వరకు కోలాహలం..
అనేక మంది దేశ, విదేశీ స్టార్టప్ నిపుణుల రాక
చర్చలు, సమావేశాలతో బిజీగా గడిపిన టెకీలు
సాయంత్రం 5 గంటలకు విచ్చేసిన సీఎం కేసీఆర్
గంటన్నర పాటు టీహబ్లోనే.. ప్రముఖులతో మాటా మంతీ
స్టార్టప్లకు ఎప్పుడూ వెన్నుదన్నుగా నిలుస్తామని హామీ
సీఎం రాకతో రెట్టింపైన ఉత్సాహం
ఉదయం నుంచి స్టార్టప్ రంగ నిపుణులతో సందడిగా ఉన్న టీహబ్లో సీఎం కేసీఆర్ రాకతో అక్కడివారిలో ఉత్సాహం రెట్టింపైంది. సాయంత్రం 5 గంటలకు విచ్చేసిన సీఎంకు అంతర్జాతీయ ప్రమాణాలు, అత్యాధునిక నిర్మాణ శైలితో నిర్మించిన టీహబ్ భవన విశేషాలను ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ వివరించారు. టీహబ్ గ్రౌండ్ ఫ్లోర్ నుంచి 5 అంతస్థులకు వరకు చేసిన ఏర్పాట్లు, వాటి ప్రత్యేకతలు, ఇంటీరియర్స్, మౌలిక వసతుల గురించి ప్రత్యేకంగా విశదీకరించారు. గ్రౌండ్ ఫ్లోర్లో శిలాఫలకంతోపాటు టీహబ్ నమూనా భవనాన్ని ఆవిష్కరించిన సీఎం కేసీఆర్.. అంతస్థులవారీగా వివరాలను తెలుసుకుంటూ 5వ ఫ్లోర్లోని సమావేశ ప్రాంగణానికి చేరుకొన్నారు.
హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 28 (నమస్తే తెలంగాణ): ప్రపంచంలోనే అతిపెద్ద స్టార్టప్ ఇన్నోవేషన్ క్యాంపస్ అయిన టీహబ్ మంగళవారం అట్టహాసంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి యావత్ స్టార్టప్ ప్రపంచమంతా తరలిరావడంతో హైదరాబాద్లో సాంకేతిక పండుగ సరికొత్తగా జరిగింది. ఉదయం నుంచి మొదలైన సందడి రాత్రి వరకు కొనసాగింది. తెలంగాణ నుంచే కాకుండా దేశంలోని వివిధ మెట్రో నగరాలు, విదేశాలకు చెందిన ప్రతినిధులు, స్టార్టప్ రంగ నిపుణులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఐటీ రంగంతోపాటు స్టార్టప్ రంగంలోని అతిరథ మహారథుల రాకతో ఐటీ హబ్లోని ఐదు అంతస్తుల్లో రోజంతా కోలాహలం కనిపించింది. రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే తారకరామారావు ఉదయం నుంచే టీహబ్లోని స్టార్టప్ షోకేస్లను, చర్చా వేదికలను సందర్శించి ప్రత్యేక అతిథులను పలకరిస్తూ అంతటా కలియతిరిగారు. పలు స్టార్టప్లు సాధించిన విజయాలను తెలుసుకొంటూ వాటి నిర్వాహకులకు అభినందనలు తెలిపారు. స్టార్టప్లకు ఎల్లప్పుడూ వెన్నుదన్నుగా ఉంటామని భరోసా ఇచ్చారు. టీహబ్ ప్రారంభోత్సవం నేపథ్యంలో నూతన ఆవిష్కరణలపై తెలంగాణ ఐటీ శాఖ ఆధ్వర్యలోని టీఎస్ఐసీ, వీహబ్, టాస్క్, టీవర్క్స్ తదితర బృందాలు రాష్ట్రంలో వారం రోజుల ముందు నుంచే జ్వాలా (ఫ్లేమ్ ఆఫ్ ఎంటర్ప్రెన్యూర్షిప్) ఉద్యమాన్ని నిర్వహించారు. అన్ని జిల్లాల్లో తిరిగిన జ్వాలా దీపాన్ని (ఇన్నోవేషన్ టార్చ్ను) రాష్ట్ర ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ సీఎం కేసీఆర్కు అందజేశారు.
స్టార్టప్ రంగ ప్రముఖులకు సన్మానం
టీహబ్ ప్రారంభోత్సవానికి వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసిన స్టార్టప్ రంగ ప్రముఖులను, టీహబ్లో స్టార్టప్లను ఏర్పాటు చేసి యూనికార్న్ కంపెనీలుగా ఎదిగినవారిని, భారీ పెట్టుబడులతో ఈ రంగాన్ని ప్రోత్సహిస్తున్నవారిని సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా శాలువాలు కప్పి సన్మానించారు. గంటన్నర పాటు సీఎం టీహబ్లోనే ఉండి నిపుణులు, ప్రముఖులతో మాట్లాడారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణ ప్రభుత్వం స్టార్టప్ రంగాన్ని ప్రోత్సహిస్తూ ముందుకు నడిపిస్తున్నదని పలువురు ప్రశంసించారు. రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ చొరవ వల్లే ప్రపంచంలోనే అతి పెద్ద ఇన్నోవేషన్ సెంటర్గా టీహబ్ నిలిచిందని పేర్కొన్నారు. కార్యక్రమంలో సీఎస్ సోమేశ్ కుమార్, టీఎస్ఐఐసీ చైర్మన్ బాలమల్లు, ఎంపీ రంజిత్రెడ్డి, రైతుబంధు సమితి అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి, టీఎస్టీఎస్ చైర్మన్ పాటిమీది జగన్మోహన్రావు, డీజీపీ మహేందర్రెడ్డి, టీహబ్ సీఈవో ఎం శ్రీనివాస్రావు, ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, ఎమ్మెల్సీ మధుసూధనాచారి, టీఎస్ఐఐసీ ఎండీ నరసింహారెడ్డి, అనేక మంది స్టార్టప్ రంగ నిపుణులు పాల్గొన్నారు.