అటవీ సమీప గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు, ర్యాలీలు
హైదరాబాద్, జూలై 29 (నమస్తేతెలంగాణ): ప్రపంచ పులుల దినోత్సవాన్ని తెలంగాణ అటవీశాఖ ఘనంగా నిర్వహించింది. అడవులు, వన్యప్రాణులకు ఉన్న విడదీయరాని అనుబంధాన్ని ప్రజలకు అర్థమయ్యేలా అటవీశాఖ కార్యక్రమాలను చేపట్టింది. ప్రధానంగా అటవీ సమీప గ్రామాల్లో ప్రజలకు అవగాహన కార్యక్రమాలను, ర్యాలీలను అధికారులు నిర్వహించారు. పులుల రక్షిత ప్రాంతాలైన అమ్రాబాద్, కవ్వాల్తోపాటు ఆదిలాబాద్, నిర్మల్, ఆసిఫాబాద్, ఖమ్మం, భద్రాచలం, మెదక్, నాగర్కర్నూలు తదితర ప్రాంతాల్లో అవగాహన కార్యక్రమాలు జరిగాయి. హైదరాబాద్ నెహ్రూ జూ పార్క్తోపాటు జాతీయ ఉద్యానవనాలు, అభయారణ్యాల్లో పలు కార్యక్రమాలను అటవీశాఖ నిర్వహించింది. అటవీశాఖ పీసీసీఎఫ్ శోభతోపాటు ఉన్నతాధికారులు అరణ్యభవన్ నుంచి జిల్లాల్లో జరిగిన కార్యక్రమాలను ఆన్లైన్ ద్వారా పర్యవేక్షించారు. 2018 లెక్కల ప్రకారం తెలంగాణలో 26 పులులు ఉన్నాయని, ప్రస్తుతం అటవీశాఖ తీసుకుంటున్న చర్యల వల్ల ఈ సంఖ్య బాగా పెరిగిందని వెల్లడించారు.