హైదరాబాద్, ఫిబ్రవరి 9 (నమస్తే తెలంగాణ): ఉన్నత విద్యలో మహిళల నమోదు పెంచడం, డ్రాపౌట్ రేటును తగ్గించడంలో భాగంగా సావిత్రిబాయి ఫూలే సింగిల్ గర్ల్చైల్డ్ ఫెలోషిప్ల నిబంధలను సవరించినట్టు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) చైర్మన్ మామిడాల జగదీశ్కుమార్ తెలిపారు. గతంలో ఏటా స్లాట్లపై సీలింగ్ విధించి, కొంతమందికే ఫెలోషిప్లను అందజేసేవారని గుర్తుచేశారు. ప్రస్తుతం ఫెలోషిప్ల స్లాట్ల సీలింగ్ను పూర్తిగా ఎత్తివేశామని వెల్లడించారు. ఇదివరకు హ్యుమానిటీస్, సోషల్సైన్సెస్ వారికే ఫెలోషిప్లు ఇచ్చేవారని, ఇప్పుడు ఇంజినీరింగ్, టెక్నాలజీ కోర్సుల్లోని అమ్మాయిలకు కూడా అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. నిరుడు సెప్టెంబర్లో సావిత్రిబాయి ఫూలే సింగిల్ గర్ల్చైల్డ్ ఫెలోషిప్కు 1,144 దరఖాస్తులొచ్చాయని చెప్పారు. వీటిలో 1,129 దరఖాస్తులను తాత్కాలికంగా ఎంపిక చేశామని పేర్కొన్నారు. అండమాన్ నికోబార్ నుంచి 1, ఈశాన్యభారతం సరిహద్దుల్లోని ప్రాంతాల నుంచి 89 దరఖాస్తులు వచ్చినట్టు జగదీశ్కుమార్ వివరించారు.