B Vinod Kumar | ఓడిపోతామని ముందే తెలిసి కొన్ని రాజకీయ పార్టీలు తెలంగాణ ప్రభుత్వంపై, బీఆర్ఎస్ పార్టీపై ఆరోపణలు చేస్తున్నాయని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ విమర్శించారు. కారు గుర్తును పోలి ఉన్న గుర్తులను ఫ్రీ సింబల్స్ జాబితా నుంచి తొలగించాలని కేంద్ర ఎన్నికల కమిషన్ను కోరామని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఎన్నికలు ప్రశాంతంగా, స్వేచ్ఛగా, శాంతియుతంగా జరిగే విధంగా బీఆర్ఎస్ అన్ని విధాలుగా ఎన్నికల సంఘానికి సహకరిస్తుందని అన్నారు.
మంగళవారం చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ నేతృత్వంలో ఎన్నికల కమిషనర్లు అనూప్ చంద్రపాండే, అరుణ్గోయల్లు, ఎన్నికల కమిషన్లోని ఇతర ఉన్నతాధికారుల బృందం హైదరాబాద్కు వచ్చింది. ఈ సందర్భంగా హోటల్ తాజ్కృష్ణలో జాతీయ, ప్రాంతీయ పార్టీల ప్రతినిధులతో ఎన్నికల కమిషన్ వేర్వేరుగా భేటీ అయ్యింది. ఈ భేటికి బీఆర్ఎస్ తరఫున రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్, బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శులు ఎం శ్రీనివాస్ రెడ్డి, సోమ భరత్ కుమార్ గుప్తా హాజరయ్యారు.
ఎంఐఎం, ఆప్, కాంగ్రెస్, బీజేపీ, సీపీఎం, ఇతర పార్టీల ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మీడియాతో బోయినపల్లి వినోద్ కుమార్ మాట్లాడుతూ బీఆర్ఎస్ కారు గుర్తుకు కేటాయించిన నాటి నుంచి 2004, 2008 ఉప ఎన్నికలు, 2009, 2014, 2018, 2019 సాధారణ ఎన్నికలు జరిగిన సందర్భంలో బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తుకు వచ్చిన ఓట్లు, కారు గుర్తును పోలిన గుర్తు ఉన్న ఇండిపెండెంట్ అభ్యర్థులకు వచ్చిన ఓట్లను వివరించామన్నారు. గతంలో ఆటో, ట్రక్కు గుర్తులను తొలగించారన్నారు.
2011లో తొలగించిన రోడ్ రోలర్ను ఇప్పుడు మరో పార్టీకి కేటాయించడం ఏమిటని ఆయన ప్రశ్నించామన్నారు. కారు పోలిన గుర్తులను రెండు మూడు రోజుల్లో తొలగించాలని కోరామన్నారు. గుర్తులపై బీఆర్ఎస్ అభ్యంతరాన్ని వెంటనే పరిష్కరిస్తామని ఎన్నికల సంఘం అధికారులు హామీ ఇచ్చినట్లు వినోద్ కుమార్ చెప్పారు. ఎన్నికల్లో గుర్తులు చాలా కీలకమైనవని, నిరక్షరాస్యులు, కంటి చూపు మందిగించిన వారు, వృద్ధులకు గుర్తులను గుర్తించడం కొద్దిగా ఇబ్బంది పడుతారన్నారు.
కారుకు, ఆటోకు, ట్రక్కుకు, రోడ్ రోలర్కు టైర్లు ఇలాంటి వాటితో అయోమయానికి గురై కారుకు వేద్దామనుకొని వేరే గుర్తుకు వేస్తున్నారన్నారు. యుగ తులసి పార్టీకి కేటాయించిన రోడ్ రోలర్ గుర్తు రద్దు చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం అధికారులను కోరామన్నారు. జాతీయ, ప్రాంతీయ పార్టీలకు ప్రత్యేకంగా ఈవీఎంలను ఏర్పాటు చేయాలని వినోద్ కుమార్ కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరారు. దీని ద్వారా జాతీయ, పార్టీల గుర్తులను పోలిన గుర్తులతో ఎలాంటి సమస్యలు రావన్నారు.
2001 నుంచి 2014 వరకు బీఆర్ఎస్ అధికారంలో లేదని అయినా అనేక ఎన్నికల్లో బ్రహ్మండమైన మెజార్టీతో గెలిచామని వినోద్ కుమార్ గుర్తు చేశారు. ఇప్పుడు కూడా ప్రజల మద్దతుతో గెలుస్తామని, బీఆర్ఎస్ ఏనాడు అధికార దుర్వినియోగానికి పాల్పడలేదని స్పష్టం చేశారు. గెలవలేమనుకునే వారే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. ఎన్నికల సమయంలో ప్రముఖులు, జాతీయ, రాష్ట్ర స్థాయి నేతలపై సామాజిక మాధ్యమాలు, యూట్యూబ్ ఛానెల్స్లో అసభ్యంగా, దూషిస్తూ మాట్లాడుతున్నారన్నారు.
తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, రాజకీయ ప్రత్యర్థులుగా కాకుండా శతృవులుగా చూస్తున్నారని ఇది ప్రజాస్వామ్య వ్యవస్థలో సరికాదన్నారు. రాజకీయ ఆరోపణలు చేసుకోవచ్చు కానీ దూషించు కోవడం, తీవ్రమైన, పరుషమైన పదజాలంతో మాట్లాడడం, విమర్శలు చేయడం మరీ ఎక్కువైందన్నారు. ప్రముఖుల కుటుంబసభ్యులపైనా కూడా ఇదే విధంగా మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి వాటిపై వెంటనే చర్యలు తీసుకునే విధంగా ఎన్నికల సంఘం స్పందించాలన్నారు.