మహబూబ్నగర్, మే 11(నమస్తే తెలంగాణ ప్రతినిధి): మంత్రి శ్రీనివాస్గౌడ్ సమర్పించిన ఎన్నికల అఫిడవిట్ సరైనదేనని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టంచేసింది. ఎన్నికల్లో పోటీ చేసిన సందర్భంలో అఫిడవిట్ మార్చారంటూ 2 ఆగస్టు 2021, 16 డిసెంబర్ 2021న రాఘవేంద్రరాజు అనే వ్యక్తి చేసిన ఫిర్యాదుపై ఎన్నికల కమిషన్ విచారణ జరిపింది. రాష్ట్ర ఎన్నికల సంఘం, మహబూబ్నగర్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి ద్వారా విచారణ చేపట్టింది. ఫిర్యాదులో నిజం లేకపోవడంతో కొట్టివేస్తున్నట్టు కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చిన ఆదేశాల ఉత్తర్వులు ఈ నెల 7న మహబూబ్నగర్ కలెక్టర్కు అందాయి. కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వుల్లో పేర్కొన్న వివరాల మేరకు.. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో మహబూబ్నగర్ నుంచి 28 మంది అభ్యర్థులు 51 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు.
వీటిలో 10 నామినేషన్లను తిరస్కరించగా, ఆరుగురు ఉపసంహరించుకొన్నారు. మిగిలిన 35 సెట్ల నామినేషన్లకు సంబంధించి 14 మంది బరిలో నిలిచారు. వీరికి సంబంధించిన 21 డూప్లికేట్/ మల్టిపుల్ నామినేషన్లను ఎన్నికల సంఘం తమ నిబంధనల మేరకు పబ్లిక్ డొమైన్లో ఉంచలేదు. ఎవరైనా అభ్యర్థి ఎక్కువ సెట్లు నామినేషన్లు దాఖలు చేసిన సందర్భంలో అతనికి సంబంధించిన సరైన నామినేషన్ వివరాలు, అఫిడవిట్ మాత్రమే పబ్లిక్ డొమైన్లో పొందుపరుస్తామని వెల్లడించింది. శ్రీనివాస్గౌడ్ సైతం నాలుగు సెట్ల నామినేషన్లు దాఖలు చేయగా, నిబంధనల మేరకు ఒక్క అఫిడవిట్ను పబ్లిక్ డొమైన్లో ఉంచినట్టు పేర్కొన్నది.
ఎన్నికల కమిషన్ వెబ్ జెనిసిస్ అప్లికేషన్ విధానం ప్రకారం డూప్లికేట్/ మల్టిపుల్ అఫిడవిట్లు పబ్లిక్కు కనిపించవని ఈసీ స్పష్టంచేసింది. ఈ వ్యవహారంపై పూర్తి విచారణ చేపట్టామని ఈ అంశంలో ఎలాంటి పొరపాట్లు జరగలేదని, ఈ అంశంలో ఎవరి తప్పు లేదని ఈసీ వెల్లడించింది. అఫిడవిట్పై చేసిన ఫిర్యాదులో ఎలాంటి చర్యలు తీసుకునేందుకు అవకాశం లేదని, ఫిర్యాదును కొట్టివేస్తున్నట్టు ఈసీ తెలిపింది. 2018 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా శ్రీనివాస్గౌడ్ సమర్పించిన అఫిడవిట్ విషయంలో ఎలాంటి అవకతవకలు జరగలేదని కలెక్టర్ వెంకట్రావు తెలిపారు. మంత్రి అఫిడవిట్ విషయమై వచ్చిన ఆరోపణలపై కేంద్ర ఎన్నికల సంఘం క్లీన్ చిట్ ఇచ్చిందని వెల్లడించారు.
అభివృద్ధిని ఓర్వలేకనే అబద్ధపు ప్రచారాలు
ఉద్యమ నేత కేసీఆర్ అడుగుజాడల్లో నడుస్తూ తెలంగాణ సాధనలో తనవంతు పాత్ర పోషించిన మంత్రి శ్రీనివాస్గౌడ్ మహబూబ్నగర్ జిల్లాను అభివృద్ధి చేస్తుంటే ఓర్వలేకనే కొందరు దుష్టశక్తులు తప్పుడు ఫిర్యాదులు చేశారని టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆరోపించారు. మంత్రి ఆధ్వర్యంలో ఊహించని స్థాయిలో జిల్లా అభివృద్ధి చెందుతుంటే కండ్లుమండిన కొందరు అబద్ధాలను ప్రచారం చేస్తూ మంత్రిపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని ముడా చైర్మన్ గంజి వెంకన్న ముదిరాజ్ మండిపడ్డారు.