Red stag | హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 15 (నమస్తే తెలంగాణ): కశ్మీర్ వ్యాలీలో అరుదైన వన్య ప్రాణిగా గుర్తింపు ఉన్న రెడ్ స్టాగ్ (హంగుల్) జింకలపై హైదరాబాద్లోని సెంటర్ ఫర్ సెల్యూలర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ) అధ్యయనం చేసింది. జింకల జనాభా, జీవావరణం, సంతతిని పెంచే అంశాలపై శాస్త్రీయంగా విశ్లేషించింది. కశ్మీర్ లోయలోని చీనాబ్ నదీ తీరంలో ఎక్కువగా సంచరించే ఈ జింకలపై సీనియర్ సైంటిస్ట్ డాక్టర్ అనురాధారెడ్డి నేతృత్వంలో అధ్యయనం చేశారు. జమ్ములోని దాచిగాం జాతీయ పార్కులో వీటిని సంరక్షిస్తుండగా, 1990లో వీటి సంఖ్య 5వేలుగా ఉండేదని గుర్తించారు.
వీటి సంతానోత్పత్తికి అవసరమైన మగ జింకల సంఖ్య 12లోపే ఉందని తేల్చారు. 14 మైక్రో శాటిలైట్ మేకర్ల ద్వారా 293 రెడ్ స్టాగ్ మల వ్యర్థాల ను పరిశోధించి వాటి జన్యు క్రమాన్ని, వాటి సంఖ్యను తేల్చారు. రుతుక్రమాలకు అనుగుణంగా వలస వెళ్లే ఈ జాతి జింకలు లోతట్టు, కొండ ప్రాంతాల్లోనే నివాసం ఉంటాయని, ఈ సమయంలోనే ఎక్కువగా సంతానోత్పత్తి చేస్తుంటాయని పేర్కొన్నారు. వీటి సంపర్కం కూడా సెప్టెంబర్- నవంబర్ మధ్యలో ఎక్కువగా ఉంటుందని గుర్తించారు. తమ పరిశోధన ద్వారా వాటి సంతానోత్పత్తిని పెంచడానికి వీలు పడుతుందని, అంతరించిపోకుండా వాటిని కాపాడుకోవచ్చని తెలిపారు. సీసీఎంబీ పరిశోధకులు చేసిన అధ్యయనాన్ని కేంబ్రిడ్జి ప్రెస్ జర్నల్ ప్రచురించింది.