హైదరాబాద్, జూన్ 3 (నమస్తే తెలంగాణ)/సైదాబాద్: హైదరాబాద్ కంచన్బాగ్లోని దేశ రక్షణ రంగసంస్థ మిశ్ర ధాతు నిగమ్ లిమిటెడ్ (మిధాని) నుంచి విలువైన ముడిసరుకును తుక్కుగా చూపిస్తూ స్క్రాప్ డీలర్లకు విక్రయిస్తున్న ముఠా గుట్టు రట్టయ్యింది. శుక్రవారం 950 కిలోల ముడిసరుకు తరలిస్తుండగా సీబీఐ అధికారులు రెడ్హ్యాండెడ్గా ఇద్దరు స్క్రాప్ డీలర్లు అదుపులోకి తీసుకొన్నారు.
వీరికి సహకరించిన మరో ఐదుగురిని కూడా అరెస్టు చేశారు. నిందితుల్లో మిధాని ఏజీఎం, తెలంగాణ స్టేట్ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్కు చెందిన అసిస్టెంట్ కమాండెంట్, కానిస్టేబుల్, ఇద్దరు క్యాజువల్ ఉద్యోగులు, ఇద్దరు స్క్రాప్ వ్యాపారులు ఉన్నారు. స్క్రాప్ ముసుగులో విలువైన లోహాన్ని వ్యాపారులకు విక్రయించి సొమ్ము చేసుకొంటున్నారని ఆరోపణలు రావడంతో సీబీఐ అధికారులు నిఘా పెట్టి నిందితులను అరెస్టుచేశారు. మొత్తం ఆరు ప్రదేశాల్లో అధికారులు సోదాలు జరిపారు.