హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 30 (నమస్తే తెలంగాణ): దేశవ్యాప్తంగా కండ్ల కలక (పింక్-ఐ) కేసులు భారీగా పెరుగుతున్నాయి. గత కొన్ని రోజులుగా కురుస్తున్న వానలతో తెలుగు రాష్ర్టాల్లో ఈ కేసుల సంఖ్య ఎక్కువగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. ఈ నెల 1 నుంచి ఇప్పటి వరకు తెలుగు రాష్ర్టాల్లో 1,000 కేసులు నమోదైనట్టు ఎల్వీ ప్రసాద్ కంటి దవాఖాన కార్నియా కన్సల్టెంట్ డాక్టర్ మురళీధర్ వెల్లడించారు. కండ్లు ఎర్రబడిన లేక గులాబీ రంగుకు మారినా, కండ్లలో మంట అనిపించినా వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు.
కండ్ల కలక వైరల్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు, పారాసైట్ల పీడనం, అలర్జీల వల్ల వస్తుందని డాక్టర్ మురళీధర్ వివరించారు. అడెనోవైరస్ వంటి ఒక ప్రత్యేక వైరస్ల సమూహంతోనూ ఈ సమస్య వచ్చే అవకాశాలున్నాయని తెలిపారు. ఇది అంటు వ్యాధి అని, వ్యాధి సోకి వ్యక్తి ఇతరులకు దూరంగా ఉంటూ తరచూ చేతులను శుభ్రం చేసుకోవాలని సూచించారు. కండ్లను తాకవద్దని, వ్యక్తిగత వస్తువులను ఇతరులతో పంచుకోవద్దని స్పష్టం చేశారు. ముఖ్యంగా పిల్లలు, వృద్ధుల విషయంలో జాగ్రత్తగా ఉండాలని తెలిపారు. ‘ఫోలిక్యూలర్ కండ్ల కలక 2 రకాలు. అందులో ఒకటి ‘ఫారింగో-కంజన్టివల్-ఫీవర్ (పీసీఎఫ్). ఇది తేలికపాటి లక్షణాలు కలిగి ఉంటుంది. జలుబు లేదా శ్వాసకోశ సమస్యలు ఉన్న పిల్లలు, యువకులలో ఇది ఎక్కువగా కనిపిస్తుంది. ప్రస్తుతం నమోదవుతున్న వాటిల్లో పీసీఎఫ్ కేసులే అధికం. రెండవది ఎపిడమిక్ కెరటో కన్జంక్టివైటిస్. దీని ప్రభావం తీవ్రంగా ఉండే అవకాశాలుంటాయి. ఇది కంటి ముందు భాగాన్ని (కార్నియా)ను ప్రభావితం చేస్తుంది. దీర్ఘకాలిక కంటి సమస్యలకు కారణమవుతుంది’ అని వివరించారు.
వ్యాధి సోకిన వెంటనే వీలైనంత వరకు వైద్యుడిని సంప్రదించాలని డాక్టర్ మురళీధర్ తెలిపారు. గోరువెచ్చటి కాపడాలు, మెత్తబరిచే కంటి మందు చుక్కలు, మంట నుంచి ఉపశమనం పొందడానికి అనెల్జెసిక్స్ వాడవచ్చని వెల్లడించారు. కాంటాక్ట్ లెన్స్ పెట్టుకోవటం, మెత్తని, చెమ్మగా ఉన్న తువ్వాలతో కంటి స్రావాన్ని సున్నితంగా శుభ్రపర్చాలని సూచించారు. ఇష్టానుసారం యాంటిబయాటిక్స్, స్టెరాయిడ్స్ వాడొద్దని పేర్కొన్నారు.