హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 11 (నమస్తే తెలంగాణ)/బంజారాహిల్స్: సినీ నిర్మాత బెల్లంకొండ సురేశ్, అతని కుమారుడు బెల్లంకొండ సాయిశ్రీనివాస్పై సీసీఎస్ పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేశారు. ఏపీలోని ప్రకాశం జిల్లాకు చెందిన వీఎల్ శ్రవణ్కుమార్ బంజారాహిల్స్ రోడ్ నంబర్-3లో ఉంటూ ఫైనాన్స్ వ్యాపారం చేస్తున్నారు. 2018లో సురేశ్, అతని కుమారుడు శ్రీనివాస్.. శ్రవణ్కుమార్ను కలిసి రూ.50 లక్షల రుణం కావాలని అడిగారు. వారు కూడా ప్రకాశం జిల్లాకు చెందిన వారు కావటం తో శ్రవణ్కుమార్ అప్పు ఇచ్చారు. ఆ తర్వాత తండ్రీకొడుకులు తరచూ అతని ఇంటికి వెళ్లి తమ తదుపరి సినిమాను గోపీచంద్ మలినేని దర్శకత్వంలో నిర్మిస్తున్నామని, పెట్టుబడి పెట్టాలని కోరారు. వారి ప్రొడక్షన్లో భాగస్వామిగా చేర్చుకొంటామని చెప్పారు. దీంతో శ్రవణ్ మరికొంత డబ్బు ఇచ్చారు. ఇలా మొత్తం రూ.85 లక్షలు అప్పుగా ఇచ్చాడు. సినిమా నిర్మాణంపై ఎలాంటి ఒప్పందం జరగలేదని, తీసుకొన్న డబ్బులు అడిగితే తండ్రీకొడుకు బెదిరించారని శ్రవణ్ 12వ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. కోర్టు ఆదేశాల మేర కు పోలీసులు సురేశ్, సాయిశ్రీనివాస్పై ఐపీసీ 406, 417, 420, 120(బి) రెడ్విత్ 156(3) సెక్షన్ల కింద కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.