ఖైరతాబాద్, జనవరి 28 : అరుదైన చికిత్సలకు నిలయంగా పేరుగాంచిన నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(నిమ్స్) గుండె వైద్యనిపుణులు మరో మైలురాయిని చేరుకున్నారు. పుట్టుకతో వచ్చిన గుండె సమస్యలతో బాధపడుతున్న 19ఏండ్ల యువతికి ఎలాంటి శస్త్రచికిత్స లేకుండానే కేవలం అత్యాధునికమైన మెడికల్ డివైస్ల ద్వారా గుండెలోని రంధ్రాన్ని పూడ్చడంతోపాటు రక్తనాళం వాల్వ్ను సరిచేశారు. రూ.50 లక్షల ఖరీదైన ఈ చికిత్సను నిమ్స్ వైద్యులు కేవలం రూ.15 లక్షలతో మెరుగైన చికిత్స అందించి కొత్త జీవితాన్ని ప్రసాదించారు.
శనివారం నిమ్స్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డైరెక్టర్ డాక్టర్ బీరప్ప, అనుసంధాన అధికారి డాక్టర్ మార్త రమేశ్తో కలిసి కార్డియాలజీ వైద్యనిపుణులు డాక్టర్ సాయిసతీశ్ కేసు వివరాలను వెల్లడించారు. జయశంకర్ భూపాలపల్లికి చెందిన బీ రాంబాబు, సుజాత దంపతుల కుమార్తె జాహ్నవి (19) పుట్టుకతోనే గుండె సమస్యలతో బాధపడుతున్నది. మూడేండ్ల వయస్సులోనే ఒక కార్పొరేట్ దవాఖానలో ఓపెన్ హార్ట్ సర్జరీ చేశారు. కానీ, గుండె పైభాగంలో ఉన్న చిన్నపాటి రంధ్రాన్ని వదిలేశారు.
14 ఏండ్ల వరకు ఆరోగ్యంగా ఉన్న రోగికి వయస్సుతోపాటు గుండెలో ఉన్న రంధ్రం పెరుగుతూ వచ్చింది. గుండె కుడివైపు నుంచి ఊపిరితిత్తులకు రక్తాన్ని సరఫరా చేసే పల్మనరీ వాల్వ్ పూర్తిగా దెబ్బతిన్నది. ఈ నెల 25న డాక్టర్ సాయిసతీశ్ నేతృత్వంలో కార్డియాలజీ వైద్యులు డాక్టర్ హేమంత్, డాక్టర్ అర్చన, సిటీ సర్జన్ డాక్టర్ అమరేశ్, అనస్తీషియా నిపుణురాలు డాక్టర్ నిర్మల బృందం రెండున్నర గంటల్లోనే ఈ ప్రక్రియను విజయవంతంగా పూర్తిచేసింది. చికిత్స జరిగిన రెండు రోజుల్లోనే రోగి పూర్తి ఆరోగ్యంతో కోలుకున్నట్టు వెల్లడించారు.