నాగర్కర్నూల్: జిల్లాలోని కల్వకుర్తి (Kalvakurthi) మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. మండలంలోని మార్చాల సమీపంలో ఓ కారు అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడిన వ్యక్తిని దవాఖానకు తరలించారు.
మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కల్వకుర్తి ప్రభుత్వ దవాఖానకు తరలించారు. మృతులను నల్లగొండ జిల్లా మిర్యాలగూడ మండలానికి చెందిన అరవింద్ (25), శిరీషా (23), కిరణ్మయి (20)గా గుర్తించారు. వీరు వెల్దండ మండల కేంద్రంలో జరిగిన ఓ వివాహ వేడుకలో పాల్గొని తిరిగి వెళ్తుండగా ప్రమాదం చోటుచేసుకుందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.