తెలంగాణలో ఉన్న వ్యాపార అనుకూల వాతావరణం కారణంగానే ఇక్కడ పెట్టుబడులు పెడుతున్నాం. గత ఏడాది నవీ ముంబైలోని గ్రీన్ఫీల్డ్ డాటా సెంటర్ డెవలప్మెంట్ సైట్ను కొనుగోలు చేసి ఇండియన్ డాటా సెంటర్ మార్కెట్లోకి ప్రవేశించాం. హైదరాబాద్లో ఏర్పాటుచేస్తున్న డాటా సెంటర్ రెండోది.
– సంజీవ్దాస్ గుప్తా, సీఈవో, సీఎల్ఐఎన్టీ
హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 6 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న క్యాపిటల్యాండ్ ఇండియా ట్రస్ట్ (సీఎల్ఐఎన్టీ)కంపెనీ రాష్ట్రంలో మరో రూ.6,200 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చింది. ఇందులో రూ.1,200 కోట్లతో హైదరాబాద్ మాదాపూర్లోని ఇంటర్నేషనల్ టెక్పార్క్లో అత్యాధునిక డాటా సెంటర్ను నెలకొల్పనున్నది. 2.5 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణం, 36 మెగావాట్ల విద్యుత్తు సామర్థ్యం కలిగి ఉండే ఈ ఐటీపీహెచ్ డాటా సెంటర్ ఐదేండ్ల తరువాత పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తుంది. దేశంలో నవీ ముంబై తరువాత కంపెనీకి చెందిన రెండో డాటాసెంటర్ ఏర్పాటుకు హైదరాబాద్ను ఎంచుకోవడం విశేషం. దీంతోపాటు రానున్న ఐదేండ్లలో మరో రూ.ఐదు వేల కోట్ల పెట్టుబడితో ప్రస్తుతం హైదరాబాద్లో తమకున్న సుమారు 60 లక్షల చదరపు అడుగుల ఆఫీస్ విస్తీర్ణాన్ని రెట్టింపు చేస్తామని కంపెనీ ప్రకటించింది. మొత్తంగా రూ.6,200 కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్టు తెలిపింది. ఇందుకు సంబంధించి మంగళవారం రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహనా ఒప్పందం కుదుర్చుకున్నది. రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావు సమక్షంలో ఐటీశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్రంజన్, క్యాపిటల్యాండ్ కంపెనీ సీఈవో సంజీవ్ దాస్ గుప్తా, రియల్ అసెట్స్ సీఈవో పాట్రిక్ బూకాక్ ఒప్పందంపై సంతకాలు చేశారు.
దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న డాటా సెంటర్ మారెట్లో హైదరాబాద్ అగ్రస్థానంలో ఉన్నదని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. మానవ భవిష్యత్తును మరింత మెరుగుపరచడంలో డాటా కీలకపాత్ర పోషిస్తున్నదని చెప్పారు. క్యాపిటల్యాండ్ ఇండియా ట్రస్ట్ తెలంగాణలో భారీ పెట్టుబడులు పెడుతున్నందుకు సంతోషంగా ఉన్నదని తెలిపారు. హైదరాబాద్లో రోజురోజుకు అభివృద్ధి చెందుతున్న ఐటీ పరిశ్రమల అవసరాలు ఈ డాటా సెంటర్తో తీరుతాయని పేర్కొన్నారు. ఇతర ఐటీ, ఐటీఈఎస్ మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల విషయంలోనూ క్యాపిటల్యాండ్తో కలిసి తెలంగాణ ప్రభు త్వం పనిచేస్తుందని అభయమిచ్చారు. లాజిస్టిక్స్, పునరుత్పాదక ఇంధనం, ఇతర మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను సైతం పొందేందుకు రాష్ట్ర ప్రభుత్వం క్యాపిటల్యాండ్తో కలిసి పనిచేస్తుందని వివరించారు. రాబోయే ఐదేండ్లలో హైదరాబాద్లోని కార్యాలయ స్థలాన్ని రెట్టింపు చేసేందుకు క్యాపిటల్యాండ్ కంపెనీ ప్రణాళికను రూపొందించుకోవడం హైదరాబాద్ నగరం ఐటీ, ఐటీఈఎస్ రంగాలకు అత్యంత అనుకూలమనే విషయం మరోసారి రుజువైందని పేర్కొన్నారు.