CAPF Exam | హైదరాబాద్, ఫిబ్రవరి 11 (నమస్తే తెలంగాణ): దేశ చరిత్రలోనే తొలిసారిగా సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ (సీఏపీఏఫ్)లో కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ) నియామక పరీక్షలను 13 ప్రాంతీయ భాషల్లో నిర్వహించనున్నారు. ఇన్నాళ్లూ హిందీ, ఇంగ్లిషులో మాత్రమే నిర్వహిస్తుండటంతో ఆయా రాష్ర్టాల అభ్యర్థులకు కేంద్ర ప్రభుత్వ పోలీసు ఉద్యోగాల్లో తీవ్ర అన్యాయం జరిగేది. అన్ని రాష్ర్టాల నుంచి కేంద్రానికి వినతులు వెల్లువెత్తుండటంతో ప్రాం తీయ భాషల్లో పరీక్షల నిర్వహణకు ఆమోదం తెలిపింది.
హిందీ, ఇంగ్లిషుతో పాటుగా 13 ప్రాంతీయ భాషల్లో సీఏపీఏఫ్ కానిస్టేబుల్ (జీడీ) పరీక్ష నిర్వహించాలని కేంద్ర హోంశాఖ ఆయా రాష్ర్టాలకు సమాచారం అందించింది. దేశంలో 128 నగరాల్లో ఈ నెల 20 నుంచి మార్చి 7 వరకు నిర్వహించే ఈ పరీక్షకు సుమారు 48 లక్షల మంది అభ్యర్థులు హాజరుకున్నారు. కేంద్రం నిర్ణయంతో హిందీ, ఇంగ్లిషుతోపాటు అస్సామీ, బెంగాలీ, గుజరాతీ, మరాఠీ, మలయాళం, కన్నడ, తమిళం, తెలుగు, ఒడియా, ఉర్దూ, పంజాబీ, మణిపురి, కొంకణి భాషల్లో కానిస్టేబుల్ పరీక్ష ప్రశ్నపత్రాలు సిద్ధమయ్యాయి. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నిర్వహిస్తున్న ముఖ్యమైన పరీక్షల్లో కానిస్టేబుల్ జనరల్ డ్యూటీ పరీక్ష ఒకటి.
‘లింగ్విస్టిక్ ఈక్వాలిటీ’పై బీఆర్ఎస్ నిరసన
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు హిందీ, ఇంగ్లిష్ను ప్రామాణికం చేయడం వల్ల కోట్లాది మంది హిందీయేతర ప్రాంత నిరుద్యోగులు నష్టపోతున్నారని, తెలుగుతోపాటు రాజ్యాం గం గుర్తించిన అన్ని అధికారిక భాషల్లోనూ పరీక్షలు నిర్వహించాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నాడు కేంద్రంపై తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చారు. కేంద్ర ప్రభుత్వ పెద్దలతో మాట్లాడి, లేఖలు సైతం రాశారు. నిరుడు ఏప్రిల్లో కేటీఆర్ సైతం కేంద్ర హోం మంత్రి అమిత్షాకు లేఖ రాశారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళంతోపాటు గుర్తించబడిన అన్ని అధికారిక భాషల్లో నిర్వహించాలని డిమాండ్ చేశారు.
‘లింగ్విస్టిక్ ఈక్వాలిటీ’ కావాలంటూ దక్షిణాదిలో నిరసనలు కొనసాగాయి. టీఎస్పీఎస్సీ మాజీ చైర్మన్ ప్రొఫెసర్ ఘంటాపాణి సహా పలువురు రాజకీయ విశ్లేషకులు, విద్యావేత్తలు గళం విప్పారు. ‘బంగ్లా పోఖో’ ప్రధాన కార్యదర్శి గార్గా ఛటర్జీ, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య, కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ఈ విషయంపై కేంద్రం స్పందించాలని విజ్ఞప్తి చేశారు. అన్ని భాషల్లోనూ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు పరీక్షను నిర్వహించేలా కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చారు. దాంతో కేంద్రం దిగివచ్చింది. ప్రాంతీయ భాషల్లో పరీక్షల నిర్వహణకు అనుమతి ఇచ్చింది.