TS TET | హైదరాబాద్, ఏప్రిల్ 1 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)పై అభ్యర్థులు ఆసక్తి చూపడంలేదు. దరఖాస్తులు అంతంతమాత్రంగానే నమోదవుతున్నాయి. మార్చి 27 నుంచి టెట్ దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైనప్పటి నుంచి సోమవారం వరకు 43 వేల మంది మాత్రమే టెట్ దరఖాస్తులు సమర్పించారు. వీరిలో పేపర్ -1కు 15,768 మంది దరఖాస్తు చేయగా, పేపర్ -2కు 24,050 దరఖాస్తులు వచ్చాయి.
ఈ రెండు పేపర్లకు హాజరయ్యేందుకు 4,173 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకొన్నారు. దీంతో మొత్తం 43,991 మంది అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేశారు. టెట్ దరఖాస్తుల గడువు ఈ నెల 10న ముగియనున్నది. గతంలో టెట్ నిర్వహించినప్పుడల్లా 4లక్షల మంది దరఖాస్తు చేసేవారు. వీరంతా నిరుద్యోగులే. అయితే ఈ ఏడాది సర్వీస్ టీచర్లు కూడా పదోన్నతుల కోసం టెట్కు హాజరవుతున్నారు. దీంతో టెట్కు భారీగా దరఖాస్తులొస్తాయన్న అంచనాలున్నాయి.
దాదాపు 5 లక్షల వరకు దరఖాస్తులొస్తాయని అధికారులు ఆశించారు. కానీ అంతగా వచ్చే పరిస్థితి కనిపించడంలేదు. ఈ సారి టెట్ ఫీజును రూ. 400 నుంచి ఒక పేపర్కు వెయ్యి, రెండు పేపర్లకు రెండు వేలు పెంచారు. దీంతో నిరుద్యోగులు ఈ ఫీజులను చూసి దరఖాస్తు చేసేందుకు జంకుతున్నారు. ఆర్థికభారంతో చితికిపోయినవారంతా టెట్కు దరఖాస్తు చేసేందుకు ముందుకురావడంలేదు.
ఈ కారణంగానే దరఖాస్తుల సంఖ్య తగ్గాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో టెట్లో క్వాలిపై అయిన వారూ స్కోర్ను మెరుగుపర్చుకునేందుకు టెట్ పరీక్షరాసేవారు. టెట్ స్కోర్ వ్యవధిని జీవితకాలం పొడగించడం, ఫీజులు భారీగా పెంచడంతో ఇక అవసరంలేదన్న భావనతో టెట్కు దూరంగా ఉంటున్నారు. మొత్తంమీద దరఖాస్తులు తగ్గేందుకు ఫీజుల పెంపుయే ప్రధాన కారణమని అభ్యర్థులు పేర్కొంటున్నారు.